
తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటంటే ఏ విషయంలో అయినాసరే చంద్రబాబునాయుడును సమర్ధించని వాళ్ళందరు తాడేపల్లి ప్యాలెస్ కుక్కలేనట. స్కిల్ స్కామ్ లో సీబీఐ, ఈడీతో విచారణ చేయించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. తన పిటీషన్ కు కారణాలను కూడా ఉండవల్లి వివరించారు. దాంతో పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపో మాపో విచారణ మొదలవుతుంది.
సీబీఐ, ఈడీ విచారణ కోరుతు ఉండవల్లి పిటీషన్ వేయటాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే నోటికొచ్చినట్లు మాజీఎంపీని తిడుతున్నారు. పార్టీ అధికారిక ట్విట్టర్లో ఉండవల్లిని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఉండవల్లి ఫొటోలు, జగన్మోహన్ రెడ్డి ఫొటోలను జతచేసి ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారు. స్కామ్ తో చంద్రబాబుకు ఎలాంటి సంబంధంలేదని పదేపదే చెబుతున్న తమ్ముళ్ళు ఉండవల్లి పిటీషన్ విషయంలో ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారో అర్ధంకావటంలేదు.
కడిగిన ముత్యంలాగ చంద్రబాబు బయటపడతారని చెబుతున్న తమ్ముళ్ళకి ఉండవల్లి పిటీషన్ తో మంచి చేశారనే అనుకోవాలికదా. సీఐడీ విచారణ చేస్తే ఏమిటి లేకపోతే సీబీఐ, ఈడీ విచారణ చేస్తే ఏమిటి ? ఆరోపణలనుండి చంద్రబాబు కడిగిన ముత్యంలాగ బయటపడటమే కదా కావాల్సింది. అందుకు ఉండవల్లి పిటీషన్ వేసి సాయంచేస్తుంటే మరెందుకు అమ్మనాబూతులు తిడుతున్నట్లు ? సీబీఐ, ఈడీ విచారణ చేస్తే చంద్రబాబు మరింతగా కేసులో ఇరుక్కుపోతురానే భయం పెరిగిపోతోందా ? అందుకనే ఉండవల్లిని తిడుతుతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇదే ఉండవల్లిని ఒకపుడు ఇదే తమ్ముళ్ళు బ్రహ్మాండమన్నారు. ఎందుకంటే మద్యం పాలసీ, పోలవరం, ఇసుక విధానం, అమరావతి నిర్మాణాలపైన ఉండవల్లి మీడియా సమావేశాల్లో జగన్ను నిలదీసేవారు. అప్పుడు తమ్ముళ్ళకు ఉండవల్లి చాలా ప్రియమైన నేత. ఎందుకంటే జగన్ను ఇబ్బందిపెట్టారు కాబట్టి. అదే ఉండవల్లిని తమ్ముళ్ళు ఇపుడు బూతులు తిడుతున్నారు. ఎందుకంటే ఉండవల్లి పిటీషన్ కారణంగా చంద్రబాబు మరింతగా కేసులో కూరుకుపోతారేమో అనే భయం పెరిగిపోతోంది కాబట్టే. ఏదేమైనా ఒకపుడు ప్రియమైన ఉండవల్లి ఇపుడు తమ్ముళ్ళందరికీ ఒక్కసారిగా కానివాడైపోయారు.