తెలంగాణలో జరిగే ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు సుస్థిర పాలన అందించాలన్నా.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నా.. బీఆర్ఎస్ తన ఉనికికి కాపాడాలన్నా ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయి. దీంతో ఇవి అన్ని పార్టీలకు పెన్ సవాల్ గా మారాయి.


ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు పరిణామాలకు ఈ ఎన్నికలు నాంది పలకనున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  ప్రస్తుత లోక్ సభ ఎన్నికలతో ప్రజలకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు.  అందువల్ల ఈ ఎన్నికలపై అటు రాజకీయ నాయకులకు , ఇటు ఓటర్లకు పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ దీనికి భిన్నంగా  లోక్ సభ ఎన్నికల్లో పార్టీలు కష్టపడుతున్నాయి.


తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ లోక్ సభ విషయానికి వచ్చే సరికి నలుగురు ఎంపీలు విజయ బావుటా ఎగురవేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ సాధించింది. అయితే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ భావిస్తోంది.


అప్పుడే తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తోంది. గత లోక్ సభకు రెట్టింపు అంటే కనీసం ఎనిమిదికి పైగా ఎంపీ సీట్లను గెలిచి తెలంగాణపై పట్టు సాధించాలని ఉవ్విళూరుతోంది. అయితే బీజేపీ బలపడిన కొద్దీ బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బీజేపీ.. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో పాటు పార్టీ నాయకులను చేర్చుకునే అవకాశం ఉంటుంది.  ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ గణనీయ సీట్లు సాధిస్తే.. దీని ప్రభావం బీఆర్ఎస్ పైనే పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs