జ‌గ‌న్‌కు రెడ్లు ముద్దు... బాబుకు క‌మ్మ‌లు వ‌ద్దు..?
- గోదావ‌రి క‌మ్మోళ్ల‌ను నేల‌కేసి కొట్టిన బాబు...
- ప‌లువురు కీల‌క నేత‌ల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క్లోజ్‌..?
- రెడ్ల‌ను మాత్రం కాపాడుకున్న జ‌గ‌న్‌... క‌మ్మ‌ల‌ను వ‌దిలేసిన బాబు..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఎదుగుదలలో.. ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో.. కమ్మ సామాజిక వర్గం పాత్ర కీలకం. పేరుకు మాత్రమే టీడీపీ కమ్మ వాళ్ళది అని చెప్పుకుంటున్నా.. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన కమ్మ వాళ్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలలో చంద్రబాబు దెబ్బతో ఎంతోమంది కమ్మవాళ్లు సీట్లు లేక.. రాజకీయంగా ప్రాధాన్యత లేక.. చివరకు పార్టీ అధికారంలోకి వస్తే చాలు అనుకునే స్థాయికి వచ్చేసారు. ఎంత విచిత్రం అంటే.. వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఒక స్థాయిలో ఉంటుంది. జగన్ తన సొంత సామాజిక వర్గాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానే వస్తుంటారు.


అసలు రెడ్లు ప్రాబల్యం లేని తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి, కాకినాడ సిటీ.. కొత్తపేట మూడు సీట్లను ఏకంగా రెడ్డి వర్గానికి జగన్ కేటాయిస్తూ వస్తున్నారు. గత మూడు ఎన్నికలలో ఇదే తంతు నడుస్తోంది. పశ్చిమగోదావరిలో పార్టీని బతికించిన కమ్మ నేతలలో.. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న గని వీరాంజనేయులుకు సీటు ఇవ్వలేదు. జనసేనతో పొత్తు వల్ల ఉంగుటూరులో గన్నీ వీరాంజనేయులు - నిడదవోలులో.. మరో కమ్మ నేత మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటు లేకుండా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ల‌పూడి బాపిరాజుకు కూడా చివరి వరకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటీవల ఆయన కాస్తంత సర్దుకున్నారు.


ఏలూరు పార్లమెంటు సీటు నుంచి గత మూడు ఎన్నికలలో వరుసగా పోటీ చేస్తూ వస్తున్న మాగంటి బాబును సైతం పక్కనపెట్టి ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. చివరకు పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న మాజీ చింతమనేని ప్రభాకర్ సైతం తన సీటు కోసం చివరి వరకు గట్టిగా పోరాటం చేయాల్సి వచ్చింది. అటు తూర్పు గోదావరిలో పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చుపెట్టే గుణ్ణం చంద్రమౌళి లాంటి వాళ్లకు ప్రాధాన్యత లేదు. రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తే రాజానగరం సీటు ఇస్తానని ఆశపెట్టిన బొడ్డు వెంకటరమణ చౌదరికి చివరికి ఏ సీటు లేకుండా చేశారు.


కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు.. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు.. సీటు లేకుండా చేశారు. ఇలా ఒకటేమిటి చంద్రబాబు తాజా రాజకీయం దెబ్బకు ఎంతోమంది కమ్మ‌నేతలు బలైపోయారని చెప్పాలి. అదే టైంలో జగన్ మాత్రం తన రెడ్డి సామాజిక వర్గానికి ఏకంగా 51 సీట్లు కేటాయించుకున్నారు. దీనికి తోడు అదనంగా మరో అయిదారు లోక్‌స‌భ‌ సీట్లు.. ఐదారు రాజ్యసభ సీట్లు కూడా కేటాయించుకుని తన సామాజిక వర్గం పై అమితమైన ప్రేమ చూపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం సొంత సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారన్న చర్చలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: