జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమయ్యింది. ఈ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పాటు అయి 2024 జూన్ 2తో పదేళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా "జయ జయహే తెలంగాణ" రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ గీతానికి సంబంధించి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. కాసేపటి క్రితమే ముగిసిన ఈ సమావేశంలో రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలపడంతో ఇక దీనిని ఆవిష్కరించడమే తరువాయి అయ్యింది.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ"ను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఇదే సమావేశంలోనే ఆ గీతాన్ని ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం కీరవాణి, సింగర్ రేవంత్ టీమ్ అద్భుతంగా పాడి వినిపించింది. గీతంపై చాలా బాగుందంటూ సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతల, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా  ఈ గీతంలో మగ్దుం మొహియుద్దీన్, షేక్ బందగి, కొమరం భీమ్ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చితే బాగుంటుందని సీపీఐ నేతలు సూచన చేసినట్లు తెలిసింది.

 అయితే ఇంతకుముందు రాసిన గీతంలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చరణాలను చేంజ్ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, గోదావరి కృష్ణమ్మలు తల్లీ నినున్న తడపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా.." వంటి కొత్త చరణాలను యాడ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ గీతం 2.30 నిమిషాల పాటు సాగనుందని తెలుస్తోంది.

 ఈ మీటింగ్ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ గీతానికి కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. జూన్ 2న దీనిని జాతికి అంకితం చేస్తానన్నారు. తెలంగాణ చిహ్నం రూపొందించడంపై కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇంకో సమావేశం పెట్టి తెలంగాణ చిహ్నంపై కూడా ఆమోదముద్ర వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్ర కూడా జూన్ రెండవ తేదీనే ఆవిష్కరించనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: