తెలుగుదేశంపార్టీ ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో భోజనాలే టాప్. రాజకీయ తీర్మానాలు, నేతల ప్రసంగాలు రోజూ ఉండేదే. భోజనాల ఏర్పాటు మాత్రం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. అది కూడా మూడు రోజులు మాత్రమే. అందుకే ఇతరత పార్టీ కార్యక్రమాల్లో హాజరు ఎలాగున్నా మహానాడు కార్యక్రమానికి మాత్రం దాదాపు ఎవ్వరూ మిస్ కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే, ఎప్పుడు మహానాడు జరిగిన వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఆహార పదార్దాలను వండించి వడ్డిస్తారు కాబట్టి. మిగితా విషయాల మాట ఎలాగున్నా భోజనా విషయంలో మాత్రం టిడిపి ఎప్పుడూ, ఎవరికీ లోటు చేయదు. ప్రతీసారి లాగే ఈ మహానాడులో కూడా అల్పాహారం, భోజనాలే హైలైట్ గా నిలుస్తోంది. మేనెల 27, 28,29 తేదీల్లో మహానాడులో ఏర్పాటు చేసిన భోజనాల గురించే రాష్ట్రమంతా చర్చిస్తున్నారు.
వింధు భోజనంపై ప్రత్యేక దృష్టి
కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి నచ్చిన వంటకాలు తినేలా భారీగా ఏర్పాట్లు జరిగాయి. మహానాడులో రోజుకు 50 వేలమందికి భోజన ఏర్పాట్లు చేశారు. 800 మంది వంటవాళ్లతో ఆహారాన్ని ఏర్పాటు చేశారు. . ఇక్కడ విశేషం ఏంటంటే సీఎంతో సహా అందరికీ ఒకేరకమైన భోజన ఏర్పాట్లు ఉన్నాయి. రోజుకు 20 ఐటమ్స్ తో విందు భోజనం ఏర్పాట్లు జరిగాయి. మూడు రోజుల్లో మొత్తం లక్షన్నర మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఉదయం అల్పాహారంతో మొదలయ్యే మహానాడు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ తర్వాత రాత్రి భోజనాలు ఇలా రోజుకు నాలుగు సార్లు అనేక రకాలు అందిస్తున్నారు. భోజనాల ఏర్పాట్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఇన్చార్జిగా ఉన్నారు. కో ఆర్డినేటర్గా అర్బన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభి పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ఫుడ్కౌంటర్లను.. కడియాల బుచ్చిబాబు, గొట్టుముక్కల రఘురామరాజు, కాట్రగడ్డ శ్రీను, బొండా ఉమాలకు అప్పగించారు. వీఐపీ కౌంటర్ను చెన్నుపాటి గాంధీ.. మీడియాకు బండారు హనుమంతరావు.. పోలీసులకు చిరుమామిళ్ళ సూర్యనారాయణ ప్రసాద్.. స్నాక్స్ ఇన్చార్జి కోయా ఆనంద్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మహనాడు మూడు రోజులు మెనూ ఇదే: మీరు కనీసం చదివైనా ఆస్వాధించండి.
మొదటి రోజు వడ్డించింది
ఈ నెల 27న ఉదయం అల్పాహారం: స్వీట్ రవ్వకేసరి, గోధుమ రవ్వ స్వీటు, ఇడ్లీ, మైసూరు బొండా, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టీ, కాఫీ అందించారు. అలాగే మధ్యాహ్న భోజనంగా ఆపిల్ హల్వా, పూర్ణం, మద్రాసు పకోడి, కొబ్బరి అన్నం, కడాయ్ వెజిటబుల్ కూర్మా, రైతా, మామిడి ఆకురాల పప్పు, దొండకాయ్ కార్న్ కోటెడ్ ఫ్రై, ములక్కాడ టమోట కర్రీ, గుత్తి వంకాయ కూర, బీరకాయ - పచ్చి బటాని. పచ్చి టమోట, కొత్తిమీర రోటీ చట్నీ. మామిడి పచ్చడి, డైమండ్ చిప్స్, సాంబార్, మజ్జిగచారు, వైట్ రైస్, పెరుగు, ఐస్క్రీమ్ ఇచ్చారు. ఇక సాయంత్రం స్నాక్ గా స్నాక్స్గా తాపేశ్వరం కాజ, ఆకు పకోడి అందించారు. రాత్రి భోజనం: సేమ్యా కేసరి, మిర్చి బజ్జి, టమాట పప్పు, బంగాళదుంప ఫ్రై, దోసకాయ కూర, గోంగూర చట్నీ, సాంబార్, చిప్స్, వైట్ రైస్, పెరుగు.
ఎన్టీఆర్ జయంతి 28 స్పెషల్
ఈ నెల 28వ తేదీన టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూ సిద్దం చేశారు. అల్పాహారంగా స్వీట్ సేమ్యారవ్వ కేసరి, ఇడ్లీ, పునుగు, గారి, కట్టిపొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, టీ, కాఫీ. మధ్నాహ్నం భోజనంలోకి చక్కెర పొంగలి, బాదం కత్రి, మసాల వడ, చింతపండు పులిహోర, వెజ్ బిర్యానీ, వెజ్ జైపూర్ కూర్మా, రైతా, ముద్దపప్పు, దప్పళం, బెండకాయ కొబ్బరి ఫ్రై, వంకాయ బటాణీ ఫ్రై, కొత్త మామిడి పచ్చడి, గోంగూర చట్నీ, ఉలవచారు క్రీమ్, సాంబారు, ప్లవర్ పాపడ్, వైట్ రైస్, హెరిటేజ్ పెరుగు, హెరిటేజ్ ఐస్క్రీమ్. సాయంత్రం స్నాక్స్గా పూతరేకులు, కాజువేరుసెనగ పకోడి. ఇక రాత్రి భోజనంలోకి బెల్లం జిలేబీ, వెజ్ కట్లెట్, పప్పు ఆకు కూర, వంకాయ పకోడి, సింగిల్ బీన్స్ గ్రేవీ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ, సాంబార్, చిప్స్ వైట్ రైస్ పెరుగును అందిస్తారు.
29వ తేదీ చవరి రోజు
అల్పాహారంగా ఇడ్లీ, పునుగు రవ్వ ఉప్మా, కొబ్బరి చట్నీ అల్లపు చట్నీ టీ కాఫీ. కాగా, మధ్నాహ్న భోజనం క్రింద బ్రెడ్ హల్వా గులాబ్జామ్ కార్న్రోల్ టమాటో రైస్ మిక్స్డ్ వెజిటబుల్ కూర్మా రైతా టమాటా పప్పు క్యాబేజీ - క్యారట్ - కోకోనట్ ఫ్రై సొరకాయ మసాలా కర్రీ బెండకాయ పులుసు మిక్స్డ్ వెజిటబుల్స్ రోటి పచ్చడి మామిడికాయ పచ్చడి ఫ్లవర్ పాపడ్ సాంబార్ పచ్చి పులుసు అన్నం హెరిటేజ్ పెరుగు హెరిటేజ్ ఐస్క్రీమ్ అందిస్తారు. అలాగే, సాయంత్రం స్నాక్స్గా బందరు లడ్డు మురుకులు. చివరగా రాత్రి భోజనంలోకి ఫ్రూట్ కేసరి అరటికాయ బజ్జీ సొరకాయపప్పు దొండకాయ కొబ్బరి ఫ్రై మామిడి - దోసకాయ - మిల్మేకర్ చట్నీ సొరకాయ చట్నీ సాంబార్ చిప్స్ వైట్ రైస్ పెరుగు. ఇపుడు చెప్పండి ఇంత మృష్ఠాన్న భోజనం అందిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఏ సెషన్ హైలైట్ అవుతుందో.