తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు ఎన్నికల నుండి తప్పుకుంటున్నారా ? పార్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కనీసం అరడజను మంది నేతలు ఎన్నికల నుండి స్వచ్చందగానే తప్పుకుంటున్నారు. తమ స్ధానాల్లో వారసులను రంగంలోకి దింపాలని యోచిస్తున్న నేతలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు అప్పుడే. వారు తప్పుకోవటానికి కారణాలు కూడా ఉన్నాయి లేండి.
ఇప్పటికి తేలింది అరడజను మందే ?
తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు, కర్నూలు జిల్లాలో కెఇ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు, అనంతపురం జిల్లాలో జెసి సోదరులు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హనుమంతరాయ చౌదరి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఇప్పటికి బయటకు వచ్చిన నేతల పేర్లు మాత్రమే ఇవి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకెంతమంది నేతల పేర్లు బయటకు వస్తాయో తెలీదు.
వారసుల కోసమే తప్పుకుంటున్నారు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుండి తన కొడుకు శ్యాంబాబుకు టిక్కెట్టు ఇవ్వాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చంద్రబాబునాయుడను కోరుతున్నారు. కెఇ కృష్ణమూర్తికి సుమారు 78 ఏళ్ళ వయస్సుకు దగ్గరలో ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్దానంలో బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగవచ్చు. అనారోగ్యం, వయస్సు తదితర కారణాలతో బొజ్జల రాజకీయాల నుండి తప్పుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో అశోక్ వచ్చేసారి తన కూతురును రంగంలోకి దింపే యోచనలో ఉన్నారు. రాజుకు ఆరోగ్య సమస్యలేమీ లేకపోయినా వయస్సు కూడా తక్కువేమీ కాదు .
అనారోగ్యమూ కారణమే
ఇక, అనారోగ్య కారణాలతో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జెసి ప్రభాకర్ రెడ్డి తప్పుకుంటున్నారు. ఇక, జెసి దివాకర్ రెడ్డి కూడా రాజకీయాల నుండి తప్పుకుంటున్నారు. వాళ్ళిద్దరూ తమ వారసులను తాడిపత్రి ఎంఎల్ఏ, అనంతపురం ఎంపిగా పోటీ చేయటానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. అనంతపురం జిల్లాలోనే కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంఎల్ఏ అయిన హనుమంతరాయ చౌదరి కూడా వయస్సు రీత్యా రాజకీయాల నుండి తప్పుకుంటున్నారు. తన స్ధానంలో కొడుకు మారుతికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
గెలుపుపై అనుమానమేనా ?
పైన చెప్పుకున్న కారణాలతో పాటు కామన్ కారణం మరొకటుందనేది పార్టీలో ప్రచారంలో ఉంది. అదేమిటంటే, వ్యతిరేకత. నాలుగేళ్ళ పాలనలో జనాలు చంద్రబాబు పాలనపై వ్యతిరేకత పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పలువురు నేతల్లో కనబడటం లేదు. అందుకనే ముందుజాగ్రత్తగా ఎన్నికల నుండి తప్పుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖర్చు మామూలుగా ఉండదు.
వారసత్వం నిలుపుకుంటున్నారా ?
అయితే, ఒకసారి ఎన్నికల బరిలో నుండి పూర్తిగా తప్పుకుంటే మళ్ళీ ఎన్నికలకు తమకు టిక్కెట్టు వస్తుందనే నమ్మకం లేదు. అందుకనే ఒకవైపు ఖర్చుల గురించి ఆలోచిస్తూనే మరోవైపు తమ స్ధానంలో తమ వారసులను తెరపైకి తెస్తున్నారు. ఈమధ్యనే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే కనీసం రూ. 25 కోట్లు అవుతుందని చెప్పటమే ఖర్చు ఏ స్ధాయిలో ఉండబోతోందో అర్ధమవుతోంది.