మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలోనే జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణమలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రి కనుసన్నల్లోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందంటూ ఆరోపణలు చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం వైపిపి కాదు. సాక్ష్యాత్తు విజయవాడ అర్బన్ శాండ్ అండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా అవే ఆరోపణలు చేస్తుండటంతో నమ్మాల్సిన పరిస్దితులున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే, జిల్లాలోని ఇసుక రీచుల్లో ఎక్కువ భాగం మంత్రి నియోజకవర్గమైన మైలవరంలోనే ఉన్నాయట. దాంతో మంత్రి పంట పండుతోంది. సహజంగా రీచులన్నీ మైలవరంలోనే ఉండటంతో జరిగే అక్రమ రవాణా మొత్తం దేవినేని కనుసన్నల్లోనే జరుగుతోందని అసోసియేషన్ ఆరోపిస్తోంది. మంత్రి మద్దతుదారులు తమ ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచేసుకుంటూ లారీ, టిప్పర్ యజమానులే ఇసుక ధరలను పెంచేస్తున్నారని చెప్పటంపై మండిపడ్డారు.
మంత్రి అనుచరులకు తప్ప ఇతరులకు అవసరమై ఇసుక అందటం లేదని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లు నాగరాజు, మోతుకూరి రామకృష్ణ మంత్రిపై మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమకు ఇసుకను అందనీయకుండా చేస్తుండటం వల్ల వచ్చే ఇసుకకు ధరలను పెంచుతున్నట్లు చెప్పారు. మంత్రి అనుచరులే కావలని ఇసుకకు కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచటానిక కారణమవుతున్నట్లు మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాలో మంత్రి అనుచరులే దోపిడి చేస్తూ ఆ దోపిడిని ఇతరులపై నెట్టేస్తే నమ్మేంత అమయాకులెవరూ లేరంటూ నాగరాజ ధ్వజమెత్తారు.
మంత్రిపై ఈ ఆరోపణలను ప్రతిపక్షాలు ఎప్పటి నుండో చేస్తున్నాయి. అయితే ఆరోపణలన్నీ రాజకీయంగా దేవినేని కొట్టేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో అందినంత దోచుకోవటానికి అధికార పార్టీ నేతలు భారీ స్కెచ్ ను వేసుకున్నారు. కాబట్టి ఓ ప్రణాళిక ప్రకారమే అక్రమ దందా సాగిపోతోంది. టిప్పర్లు, లారీలు ఎవరివో అందరికీ తెలుసు కాబట్టే ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవటం లేదు. అదే విషయాన్ని అసోసియేషన్ ఇంతకాలానికి బహిరంగా ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల, ధరలు పెరిగిపోవటం వల్ల సామన్యా, మధ్య తరగతి జనాలే ఎక్కువగా నష్టపోతున్నట్లు వారు చెప్పారు.