మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. మహానాయకుడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడంటు చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ జెండాను లాక్కొని ప్రజలను మభ్యపెట్టి మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారని, అయితే ఈసారి టీడీపీ ఓటమి తథ్యం ఆయన జోశ్యం చెప్పారు.
టీడీపీ వ్యవస్థాపక దినం సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మోత్కుపల్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓ రేంజిలో ఏకిపారేశారు. ఏపీలో చేసింది ఏమీ లేక కేసీఆర్ని నిందిస్తున్నారని, కుట్ర చేసి వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ను చెప్పులతో కొట్టించిన వ్యక్తి, చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.
చేసిన మోసం బయటపడుతుందనే 29 కేసులపై స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఓటమే లక్ష్యంగా తాను ఏప్రిల్ 1న విజయవాడలో దీక్ష చేయబోతున్నానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మోత్కుపల్లిని ఏపీ గవర్నర్ని చేస్తానని చంద్రబాబు మాటిచ్చి తప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోత్కుపల్లి తనకు అందిన అవకాశాన్ని వాడుకుంటూ బాబుకు చుక్కలు చూపిస్తున్నారు.