ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న చట్టోగ్రామ్ టెస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఏకపక్షముగా ముగిసేలాగా కనిపించిన టెస్ట్ కాస్తా, రెండవ ఇన్నింగ్స్ లో బంగ్లా ఓపెనర్లు అసాధారణంగా పోరాడడంతో ఆటలో ఫలితం రావడానికి అయిదవ రోజు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. నిన్న ఇండియా డిక్లరేషన్ తర్వాత బంగ్లా చాలా పాజిటివ్ ఇంటెంట్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. బంగ్లా ఓపెనర్లు శాంటో మరియు హాసన్ లు వచ్చిన ప్రతీ మంచి బంతిని గౌరవిస్తూ , చెత్త బంతులకు పరుగులు చేస్తూ స్కోర్ బోర్డు ను కదిలించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ కాస్తా గతి తప్పింది. అయినా ఓపెనర్ జాకీర్ హాసన్ సెంచరీ సాధించి బంగ్లా పరువును కాపాడాడు అని చెప్పాలి. ప్రస్తుతం నాలుగవ రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్ షకిబుల్ హాసన్ మరియు మెహిదీ హాసన్ మిరాజ్ లు ఉన్నారు. వీరిద్దరికి ఏడవ వికెట్ కు  34 పరుగులు జోడించి బంగ్లాను కాస్త మెరుగైన పరిస్థితిలో నిలిపారని చెప్పాలి. ప్రస్తుతం షకిబుల్ హాసన్ 40 పరుగులతో మరియు మిరాజ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరినీ రేపు త్వరగా అవుట్ చేయకపోతే ఎంత డామేజ్ చేయగలరు అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షకిబుల్ ఎవరిని అయినా సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు చేయగలడు. ఇక మిరాజ్ ఇప్పటికే వన్ డే సిరీస్ లో అద్భుతంగా ఆడి ఇండియా నుండి సిరీస్ ను లాగేసుకున్నాడు.

బంగ్లా కోల్పోయిన 6 వికెట్లలో  అక్షర్ పటేల్ మూడు, అశ్విన్ 1 , కుల్దీవ్ 1 మరియు ఉమేష్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నారు. అయితే మొదటి ఇన్నింగ్స్ తో పోలిస్తే ఇండియా బౌలర్లు అంత ప్రభావవంతంగా ఇబ్బందిపెట్టలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ సైతం కేవలం ఒక వికెట్ తో సరిపెట్టుకున్నాడు. రేపు ఉదయం మొదటి సెషన్ లోనే బంగ్లా భరతం పట్టి టీం కు విజయాన్ని అందించాలని కోరుకుందాం. ఇండియా గెలుపుకు 4 వికెట్లు మరియు బంగ్లా గెలుపుకు 241 పరుగులు కావాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: