పాపం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని చూస్తుంటే జాలిగా ఉంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనే సామెతుంది. కానీ ఇక్కడ వ్రతమూ చెడింది..ఫలితం దక్కే అవకాశం లేదు అన్నట్లుగా తయారైపోయింది చంద్రబాబునాయుడు వ్యవహారం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధుల విజయం కోసం చంద్రబాబు కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం లాంటి కార్పొరేషన్లలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే తెలుగుదేశంపార్టీ ఎక్కడా గెలిచే అవకాశాలు లేవన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే పలానా కార్పొరేషన్లో ఏపార్టీ గెలవాలన్నా కనీసం సగం డివిజన్లలో గెలవాల్సుంటుంది. అలాంటిది సగం డివిజన్లలో కూడా పోటీ చేయని పార్టీ ఇక మేయర్ సీటును ఎలా గెలుచుకుంటుంది ?




ఇపుడిదే అంశంపై పార్టీలోనే పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది. ఉదాహరణకు తిరుపతి కార్పొరేషన్నే తీసుకుందాం. తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. టీడీపీ సగం డివిజన్లలో కూడా పోటీ చేయటంలేదు. సగం డివిజన్లలో కూడా పోటీ చేయని పార్టీ ఇక మేయర్ స్ధానాన్ని గెలుకుకునే అవకాశమే లేదు. అయినా చంద్రబాబు ప్రచారానికి రెడీ అయిపోతున్నారు. ఇక వైజాగ్ కార్పొరేషన్ తీసుకుంటే 98 డివిజన్లున్నాయి. ఏ పార్టీ మేయర్ సీటును గెలుచుకోవాలన్నా తక్కువలో తక్కువ 50 డివిజన్లు గెలుచుకోవాలి. కానీ టీడీపీ సగం డివిజన్లలో కూడా సీరియస్ పోటీ ఇవ్వటం లేదు. అయినా ఇక్కడ చంద్రబాబు ప్రచారానికి రెడీ అయిపోయారు. ఇఫ్పటికే చినబాబు లోకేష్ ప్రచారం చేస్తున్నారు.




రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ తీసుకున్నా, మున్సిపాలిటిని తీసుకున్నా టీడీపీ వరస ఇలాగే ఉంది. అన్నీ డివిజన్లు, వార్డుల్లో పోటీకి  స్ధానిక నేతలే వెనకాడినపుడు ఇక చంద్రబాబు ఎంత ప్రచారం చేస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది ? అయినా మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల గెలుపుకు కూడా చంద్రబాబే ప్రచారం చేయాలా ? ఏం ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలు లేకపోతే నేతలు సరిపోరా ? స్ధానిక నేతలకన్నా లోకల్ పరిస్ధితులు చంద్రబాబుకు ఎక్కువ తెలిసే అవకాశం లేదు కదా ? స్ధానిక సమీరణలు కూడా లోకల్ లీడర్లకే ఎక్కువగా తెలుసుంటాయి. ఎలాగైనా స్ధానిక ఎన్నికలంటే అధికారపార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువుంటాయి. మరి  ఈ విషయం తెలిసికూడా చంద్రబాబు ఇంతోటిదానికి ఎందుకింత ప్రయాస పడుతున్నారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: