ప్రళయం ముగిసి విశ్వాంతరాళం స్థిమిత పడ్డాక బ్రహ్మ దేవుడు మరల తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరాళంలో “బ్రహ్మకల్పం” అంటారు. ఇలా ప్రతికల్పం లోను మొదట వచ్చేది కాలాన్నియుగం అని దాని తొలిరోజును “యుగాది” అని అంటే యుగానికి తొలి సమయంగా, ప్రారంభంగా ‘ఉగాది’ అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగు వారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోని ఛైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల దీన్ని “తెలుగు సంవత్సరానికి ఆరంభం” గా చూస్తాం.

ప్రకృతిలో మార్పు ఈ రోజున గణనీయంగా కనిపిస్తుంది. నవ వసంత పరిమళాలతో జగమంతా నూతన సౌంధర్యం సంతరించుకొని తరించి వచ్చే తొలి పండుగను తెలుగు వారంతా ఘనంగా జరుపుకుంటారు. అన్ని కర్మలకూ మూలం మనసు అని నమ్మే న తెలుగు జాతి మనసుకు అధిపతి అయిన అధిపతి అయిన చంద్రుని ఆరాధనతో చాంద్రమానం ప్రామాణికంగా స్వీకరించి “ఉగాది” పండుగ ని జరుపుకోవటం సాంప్రదాయం. అలా ఉగాది లేదా ఉగాది సంస్కృతిలో ఇమిడిపోయింది.
యుగాది నుండే కాలగణనం చేయటం జరిగి, కాలాన్ని లెక్కించడానికి అవకాశం ఏర్పడుతుందని సనాతనకాలం నుండీ పండితులు భావిస్తూవచ్చారు. లక్ష్మీ కటాక్షానికి, విజయసాధనకు, నిత్య జీవన చైతన్యానికి, సకల జీవులకు ఉగాది శోభను ఇనుమడింపజేస్తుంది. ప్రకృతి నూతనత్వం వసంత శోభను ఉగాది రోజు నుండే సంతరించు కోవటం మానవ జాతి శాత సహస్రాబ్ధాలుగా గమనిస్తూ వస్తూనే ఉంది.
ఉగాది పర్వదిన శుభోదయ వేళ క్షణాలు, నిముషాలు, గంటలు, ఘడియలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ఆ వర్షం అంతా ప్రాణులు సకల చరాచర జీవరాసి కాలస్వరూపమై న ఏడాదిలో గమిస్తూ నివసిస్తుంటాయి. అందుచేత ఉగాది శుభశంరంభాన జనులు అందరూ ప్రాతఃకాలంలో లేచి అభ్యంగనస్నానం ఆచరించి, కొత్త వస్త్రాలు ధరించి మంగళ ప్రదమైన మావిడాకులు, బంతిపూల తోరణాలతో గృహాలను అలంకరించి, రంగవల్లికలతో వాకిలిని కూడా అలంకరించి, ఉగాది శుభోదయాన “వసంతలక్ష్మీ” కి స్వాగతం పలుకుతారు.
షడ్రచుల లేదా ఆరు రుచుల సమ్మిళతమైన “ఉగాది పచ్చడి” ని పంచాగానికి, కాల దేవతకు ఆరాధనతో నివేదన చేసి, తమ భావిజీవితాలు మృదుమధురం, మనోరంజకం గా సాగిపోవాలని కోరుకుంటారు. ఉగాది పచ్చడి ఓషధులు మిళితమై ఉండి ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని జింహచాపల్యాన్ని సహితం తృప్తిపరుస్తుంది.

ఉగాదినాడు “పంచాంగ శ్రవణం” పరమోన్నతమై విరాజిల్లితే ఉగాది పచ్చడికి విశేష ఆరోగ్య ఛైతన్య ప్రాధాన్యత ఉంది. అందుకే ఉగాది అనగానే జనుల మనసుల్లో మెదిలే ముఖ్యమైన మధురోహ “ఉగాది పచ్చడి” ఇది షడ్రుచుల అంటే ఆరు రుచుల కలయిక లేక సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసింది ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
దీని కోసం వసంత ఋతుసమయాన కొత్తగాలభించే చెరకు, మామిడి, వేపపువ్వు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం ప్రకృతి నుంచి లభించే వీటినే ఉగాది పచ్చడి లో వాడుతారు. ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’ అని వ్యవహరించేవారు. ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడిని స్వీకరించే సాంప్రదాయం ప్రశస్థంగా ఉంది.

ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతి లో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవాళ్లు. ఈ పచ్చడిని ఉగాది తరవాత వచ్చే మహామహోన్విత పర్వదినం శ్రీరామనవమి వరకు తినాలని పండితులు చెబుతున్నారు. బెల్లంలోని తీయదనం సుఖానికీ, లాభానికీ, ప్రేమకు, విజయానికి సంకేతం. వేప లోని చేదు రుచి దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖ దుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడమే. సుఖ దుక్ఖాలు సమానమేనని అవిప్రకృతిలోనే ఇమిడి ఉన్నాయని చెప్పటం దీని ఉద్దేశం. ఉగాది పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి,చేదులు మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తాయి.

"త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు" అనే ఈ మంత్రం పఠనం తో ఉగాది పచ్చడి స్వీకరించాలని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం, ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి, ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాదు హిందూ పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి, ఆరోగ్యానికి గల సంబంధాన్ని విశదీకరిస్తుంది. ఉగాదితో ప్రారంభమయ్యే సంవత్సరానికి ఆనందంగా అనాదిగా స్వాతాంజలి పలకటం ఆచారం.
ఏపి హెరాల్డ్ పాఠక లొకానికి, నిర్వాహక బృందానికి, ప్రకటన కర్తలకు "విళంభి నామ సంవత్సర" శుభాకాంక్షలు...
