తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఒక వ్యక్తి ధరించే వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని తిలకమని అంటారు. ఇది సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది. శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం.


బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. కానీ అదే దాని పరమార్థం కాదు.అది అనునిత్యం జరిపే ఒక గొప్ప  సంస్కారం. కనుబొమల మధ్య ప్రదేశంలో వెనుకగా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని మధ్య వేలితో సున్నితంగా స్పృశించి ఆజ్ఞాచక్రాన్ని  ప్రచోదన చేయటం తిలక ధారణలోని పరమార్థం.  శక్తి ప్రసరణ, వితరణ కేంద్రాలైన షట్చక్రాల పైన పెత్తనం చేస్తూ వాటిని తన అదుపులో ఉంచుకునేది, వాటిని ఆజ్ఞాపించి పని చేయించ గలిగినది కనుక భ్రూమధ్యంలో ఉండే ఈ చక్రానికి ఆజ్ఞా చక్రం అనే పేరు సార్థకం. ఇది సరిగ్గా ఉంటే మిగిలిన చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆజ్ఞా చక్రం ప్రచోదనమైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది.  అందుకే గురువు శిష్యునికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూ మధ్య ప్రదేశాన్ని స్పృశించి  ఆజ్ఞా చక్రాన్ని ప్రచోదన చేస్తాడు.


ఈ విధంగా ప్రచోదన చేసినదానికి సంకేతంగా  ఏదో ఒక గుర్తుని ఉంచటం ఆచారంగా వచ్చింది. దీని కోసం భారతీయులు ఉపయోగించిన సామాగ్రి వారి భావ విస్తృతిని తెలియజేస్తుంది. తరచుగా వాడేది కుంకుమ . అది పసుపులో కుంకుమ రాళ్ళు వేసి చేసినది కావచ్చు, నిమ్మరసంలో పసుపు కొమ్ములను నానవేసి చేసినది కావచ్చు, ఇంకా సిందూరం, తిరుచూర్ణం , గంధం,  అక్షతలు,విభూతి, చాదు [దీన్ని ఎన్నోరకాలుగా తయారు చేస్తారు] ..... ఇంకా  శక్తి ఉంటే కస్తూరి, పునుగు,జవ్వాది, పచ్చ కర్పూరం, నవ రత్నాలు........ ఎవరి శక్తి ననుసరించి  వారి వైభోగం.


ధరించిన తిలకాన్ని బట్టి ఏ సంప్రదాయానికి చెందిన వారో సులభంగా గుర్తించవచ్చు. ముఖాన బొట్టు ఉండటం మరెన్నో అంశాలని సూచిస్తుంది. బొట్టు లేకపోతే అది పాచి మొహం.   . ఇంకా  స్నానం కాలేదని సామాన్యార్థం. శుభ కార్యాలు చేయటానికి అర్హత లేని సూతక సమయం   కూడా కావచ్చు.  అంటే, నుదుటనున్న తిలకం శుభ కార్యాలు చేయటానికి, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వర్తించటానికి  అర్హత ఉన్నదని సూచిస్తుంది. అందుకే స్నానం చేయగానే ముందుగా తమ తమ సంప్రదాయాల కనుగుణంగా  తిలక ధారణ చేసి మరీ   పూజాదికాలు నిర్వర్తిస్తారు. ముత్తైదువలైన స్త్రీలు ముఖాన బొట్టు లేకుండా ఒక్క క్షణమైనా ఉండరు. అది అయిదోతనానికి చిహ్నం కదా!  వివాహ సమయంలో వరుడు తన పంచ ప్రాణాలను వధువు శరీరంలో నిక్షేపం చేసే స్థానాల్లో బొట్టుపెట్టుకునే చోటు కూడా ఒకటి. 


బొట్టు పెట్టుకోవటమే కాదు పెట్టటం కూడా మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టటం  మర్యాదకి చిహ్నం.  ఆహ్వానించటానికి బొట్టు పెట్టి మరీ పిలవటం ఆచారమై పోయింది. ఎవరికైనా  పని అప్పచెప్పేటప్పుడు చందన మలది కుంకుమ పెడతారు. పిల్లలకి బొట్టు పెడితే దిష్టి తగలదని నమ్మకం.  ఒకప్పుడు మంచి రంగు పరిమళం ఉన్న కుంకుమ తయారు చేయటం ఒక కళగా భావించేవారు. తరువాత ద్రవ రూపంలోను , ఆపై పేస్టు రూపంలోను, తిలకాలు వచ్చాయి. ఇప్పుడు బొట్టు బిళ్ళలు రకరకాల రంగులు, ఆకృతులలో వస్తున్నాయి.  ఇవి స్త్రీలకే పరిమితం.  కాని, తిలక ధారణ మాత్రం స్త్రీ పురుష భేదం లేక అందరు పాటించ వలసినది.  మేలు కూర్చేది


మరింత సమాచారం తెలుసుకోండి: