ద్వారపూడి.. తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన ఒక చిన్న గ్రామము. పచ్చని పొలాలతో, తోటలతో కనులవిందుగా ఉంటుంది. ద్వారపూడి గ్రామంలో ఫెమస్ ఏంటిది అంటే ఆది అయ్యప్ప స్వామి ఆలయమనే చెప్పాలి. అందుకే ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం గా వెలుగొందుతుంది. కేరళ రాష్ట్రంలో ఉన్న ఆలయం మాదిరిగానే ద్వారపూడిలోని ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించినారు. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భగుడి, కేరళ లోని శబరిమలై తరహాలో అచ్చుగుద్దినట్టు ఉంటుంది.
అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమలదాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు. అలాంటివారు ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలనుంచేకాక ఒరిస్సానుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రతిష్టింపబడ్డ అయ్యప్పస్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేసినది. ఇక్కడ అయ్యప్పగుడి రెండు అంతస్తులగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్పస్వామి మందిరం ఉన్నది.
క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరంకు వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి ఒకటి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం ఉన్నది. అలాగూ 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిచే ప్రతిష్టింపబడినది. ఈ స్వామి సన్నిధికి చేరటానికి ఏర్పాటు చేసిన పధ్దెనిమిది మెట్లకి కూడా ఒక విశేషం వున్నది. ఈ పధ్దెనిమిది మెట్లనూ తమిళనాడులోని తురుమూరునుంచి తెప్పించిన ఏక శిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయించారు.