నేటి తరంలో స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ.. వాట్సాప్ పరిచయం అక్కర్లేని పేరు. కాలేజీ యువత నుంచి పండు ముదుసళ్ల వరకూ.. గృహిణుల మొదలు ఉద్యోగినుల వరకూ.. బిజినెస్ చేసే వారితో పాటు బేకార్గా తిరిగేవారి దాకా.. అందరి వద్దా స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే వాట్సాప్ వినియోగం కూడా పెరిగిపోతోంది. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ సులువుగా ఉండడంతో అందరూ వాట్సాప్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి.
ఇక వాట్సప్లో గ్రూప్స్లో ఫార్వర్డ్ మెసేజెస్ నాన్స్టాప్గా వస్తుంటాయి. వచ్చిన మేసెజ్లే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అయితే అందులో ఎక్కువగా ఫేక్ న్యూస్లే ఉండడంతో మరింత తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే ఫార్వర్డ్ లిమిట్ను ఐదుగురికి తగ్గించింది వాట్సప్. దీంతో ఫార్వర్డ్ మెసేజెస్ 25 శాతం వరకు తగ్గినట్టు గతంలో లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అసత్య సమాచారం, తప్పుడు వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని అరికట్టే దిశగా వాట్సాప్ ఇటీవల మరో సారి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా.. ఫార్వర్డ్ లిమిట్ను ఒకరికి మాత్రమే తగ్గించింది వాట్సప్. వాట్సప్ ద్వారా ఒకరికంటే ఎక్కువ మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేయలేని విధంగా ఆంక్షలు తీసుకొచ్చింది. దీంతో ఫ్రీక్వెంట్లీ ఫార్వెర్డెడ్ మెసేజెస్ భారీగా తగ్గిపోయాయి. ఫార్వర్డ్ మెసేజెస్ 70 శాతం తగ్గినట్టు వాట్సప్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా.. వైరల్ మెసేజెస్ సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. కొత్త లిమిట్ పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్ మెసేజెస్ పంపించడం 70 శాతం తగ్గింది. దీని వల్ల పర్సనల్, ప్రైవేట్ మెసేజెస్ పంపడానికి వాట్సప్ వేదికగా మారిందంటూ వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.