ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ఫొటోలు, రీల్స్కు చాలా మంది నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని యూజర్ల నుంచి ఇటీవల ఇన్స్టాగ్రామ్కు చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణకు కొత్త ఫీచర్లను తీసుకొచ్చామని ఇన్స్టా హెడ్ ఆడ్ మోసెరి పేర్కొన్నారు. ఈ సమస్యను ఉదహరిస్తూ యూరో 2020 ఫుట్బాల్ ఫైనల్ సందర్భంగా చాలా మంది ఇంగ్లాడ్ క్రీడాకారులు అభిమానుల కామెంట్లు, ఆగ్రహానికి ఇబ్బందిపడ్డారు. దీని ద్వారా వారు మానసికంగా చాలా దెబ్బతిన్నారు. ఈ ఇన్స్టాగ్రామ్లో అటువంటి కామెంట్లను నియంత్రించడం అసాధ్యంగా మారింది. దాంతో ఇలాంటి చర్యలు జరగకుండా యూజర్ల రక్షణ కోసమే లిమిట్ ఫీచర్ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ల ఎకౌంట్లకు రక్షణ కల్పించే బాధ్యత మాపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇన్స్టాగ్రామ్లో దూషణలు, ద్వేషపూరితమైన వాఖ్యలు చేస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి కామెంట్లు పెడితే వాటిని తీసివేస్తామన్నారు. యూజర్ల కోసం ప్రత్యేకంగా లిమిట్ ఆప్షన్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే పరిమితమైన కామెంట్లు, రిక్వెస్టులు మాత్రమే వస్తాయి. ఎవరైన యూజర్ ఇన్స్టాగ్రామ్ ప్రైవసీ సెట్టింగ్లో లిమిట్ ఆప్షన్ను ఆన్ చేసుకుంటే ఆ యూజర్కు ఎవరూ నేరుగా మెసేజ్ చెయ్యలేరు. కామెంట్లు కూడా అనుమతితోనే చేయడానికి వీలవుతుంది.
అంతేగాకుండా మీరు ఫాలో అవ్వని వారి నుంచి ఎలాంటి కామెంట్లు రావని తెలిపారు. ఈ ఫీచర్ లో మరో అదనపు సౌలభ్యం కూడా ఉంది. ఎవరైన ఉద్దేశపూర్వకంగా పదే పదే అసభ్య సందేశాలు పంపినా వాటిని హైడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇన్స్టా యూజర్లు తమపై వస్తున్న అసభ్య కామెంట్లను నియంత్రించవచ్చని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఫీచర్తో ఇన్స్టాగ్రామ్లో మరికొంత మంది యూజర్లు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్లో 120 మిలియన్ యూజర్లు ఇంస్టాగ్రామ్ ను వాడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి