యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్‌ సైనేడ్‌ మోహన్‌ కుమార్‌ (56)కు మరణ శిక్ష ఖరారయింది.  మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.  గురువారం తీర్పు వెలువరిస్తూ మోహన్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తరువాత మరణ శిక్ష అమలు చేయాలని తెలిపారు. మొత్తం 17 కేసులకు గాను నాలుగింటిలో అతనికి మరణ శిక్ష ఖరారు అయింది. 


మహిళ కనిపిస్తే మాటలు కలుపుతాడు. తానో పెద్ద మనిషినని, మీ కష్టాలు తీర్చేస్తానని నమ్మిస్తాడు. షికార్లకు తీసుకెళ్లడం, తలనొప్పి మాత్ర పేరుతో సైనేడ్‌ ఇచ్చి ప్రాణాలు తీయడం అతనికి మంచినీళ్లు తాగినంత సులభం. ఆపై నగలు, డబ్బుతో ఉడాయిస్తాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది వనితల ఉసురు తీసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.హంతకుడు మోహన్‌ ప్రస్తుతం బెళగావిలోని హిండల్గా సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యాడు. అతడు పాల్పడిన నేరం దృష్ట్యా మరణ శిక్షకు అర్హుడని ప్రభుత్వ న్యాయవాది జుడిత్‌ ఓల్గా వాదనలు వినిపించారు. 


సుమారు పదేళ్ల కిందట... దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాళెపుణి అంగనవాడిలో సహయకురాలిగా పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకుని, ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి మెజెస్టిక్‌ వద్ద లాడ్జిలో దిగారు. మరుసటి రోజుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలంటూ సైనేడ్‌ఇచ్చాడు. ఆమె నగలు, డబ్బుతో పరారయ్యా డు.


సుమారు 20 మంది అమాయ మహిళలను సైనైడ్‌తో హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. 1980 నుంచి 2003 వరకు మంగళూరు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయ మహిళలను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు.  కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో సైనైడ్‌ను ఉపయోగించి తన హత్యా పరంపరపను కొనసాగించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: