ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేళ ఏళ్లకు పూర్వమే భారతీయులు వినియోగించారంటే అతిశయోక్తి కాదు. క్రీ.పూ. 3 శతాబ్దానికే ఈ పద్దతి వినియోగంలో ఉంది. ఇప్పుడు వినియోగిస్తున్న 1 నుంచి 9 వరకు అంకెలతో పునాదులేసి ఆ తరువాత కొత్తగా సున్నా(0)ను సైతం కనుగొని గణిత ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారు. అప్పటి వరకు చుక్కానీలేని నావలా ఉన్న గణితానికి భారతీయులు సున్నాను కనిపెట్టి కొత్త రూపునిచ్చారు. తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించిన భారతీయులు ప్రపంచ గణితాన్ని కొత్తపుంతలు తొక్కించారు.



20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో ఈరోడ్‌లోని కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. పదమూడేళ్లకే ఎస్ఎల్ లోనీ త్రికోణమితిపై సొంతంగా సిద్ధాంతాలు కూడా ప్రారంభించారు. ఇక ఆయన ప్రధానంగా మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు.



మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ, రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. ఐదేళ్ల అనంతరం బ్రిటన్ నుంచి 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. అపారమైన తన గణిత పరిజ్ఞానంతో భారతీయ ప్రతిభను ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ తన జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణిత దినోత్సవం’గా ప్రకటించింది. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో మంచానపడ్డప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను వివరించి ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు‘నేనోసారి రామానుజన్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్లాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడటానికి డల్‌గా కనిపిస్తోంది.. ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు.. ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య.. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నదని విశదీకరించారు.. 1729 = 103+93 = 123+13. వీటిని ట్యాక్సీ క్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం’ అని హార్టీ అన్నారు.



రామానుజన్ జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత, రామానుజాన్ని శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొన్నారు. ‘తన ప్రతిభాపాటవాలు, సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవారని.. తనకు ఏ కష్టమొచ్చినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవారు.. ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవారు. భగవంతుడు ప్రాతినిధ్యం వహించని ఏ ఆలోచన కూడా సూత్రం కాదని అప్పుడప్పుడూ అంటుండేవారు’ అని వివరించారు. అయితే, రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: