మొన్నటి వరకూ ఉల్లి హడలెత్తిస్తే.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడునెలలతో పోలిస్తే వెల్లుల్లి గడ్డ ధర ఏకంగా 250 రూపాయలకు చేరింది. ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో వంట ఎలా చేసుకోవాలో తెలియక  పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలా ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. 

 

నిన్నటి వరకూ ఉల్లి ధర పేలిపోయింది. కోయడం కాదు కదా ముట్టుకోవాలంటే  జనం భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో జనం అల్లాడిపోయారు. ప్రభుత్వ ఈజిప్టు నుంచి ఉల్లిదిగుమతులు చేసుకుని.. వాటిని రాయితీపై అందించే వరకూ ఉల్లి రెండువందల రూపాయలే పలికింది. ఇప్పుడిప్పుడే ఉల్లి ధర దిగివస్తోంది. ఇలాంటి సమయంలో వెల్లుల్లి .. ఒక్కసారిగా విశ్వరూపాన్ని చూపిస్తోంది. ధర కొండెక్కి కూర్చుంది. 

 

ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెల్లుల్లి రెండు వందల పైచిలుకు పలుకుతోంది. ఇది కూడా హోల్ సేల్ మార్కెట్లో ఈ ధరకు లభిస్తోంది. ఇక రిటైల్ మార్కెట్‌లో నైతే... ఏకంగా 250 పైనే ధర ఉంది. ఉల్లి తరహాలో ప్రభుత్వం వెల్లుల్లి గడ్డలను కొనుగోలు చేసి.. రాయితీపై అందించాలని జనం కోరుతున్నారు. 


సాధారణంగా శీతాకాలంలో వెల్లుల్లి ధరలు కాస్త పెరగడం కామన్‌.  కానీ ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ధరలు అధికంగా ఉండటంతో .. వ్యాపారం పడిపోయిందంటున్నారు. దీనికి తోడు రైతుల దగ్గర నుండి సరుకు మార్కెట్ కు రాకముందే దళారులు పక్కదారి పట్టిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా వెల్లుల్లి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లో కురిసిన అకాల వర్షాలతో పంట దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో  వెల్లుల్లి ధర కొండె క్కింది. నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ గణాంకాల ప్రకారం  వెల్లుల్లి ధరలు ఢిల్లీలో అత్యధికంగా 55శాతం పెరిగాయి.

 

ముంబయిలోని రిటైల్‌ మార్కెట్లో కిలో వెల్లుల్లి రూ.250 రూపాయలకు ఎగబాకింది. గతనెలతో పోలిస్తే 100 శాతం పెరిగింది. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, గుజరాత్‌ మార్కెట్లతో పాటు దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ఉన్నపలంగా డిమాండ్‌ బాగా పెరిగింది. ముంబయి హౌల్‌సేల్‌ మార్కెట్‌కు 112 టన్నుల వెల్లుల్లి అవసరం కాగా.. 64 టన్నుల వరకూ వస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

 

ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోయి.. తమ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని .. పేద, సామాన్యతరగతి ప్రజలు వాపోతున్నారు.పెరిగిన ధరలను ప్రభుత్వమే భరించి.. రాయితీపై అందించాలని కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: