
ప్రస్తుతం మామిడికాయల సీజన్.. కాబట్టి పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి. అలాంటి పచ్చి మామిడికాయలు కోసి ఉప్పు కారం వేసుకొని తింటే ఆహా అని అంటారు.. అలాంటి ఆహా అనిపించే మామిడికాయ రెసిపీలు ఎన్నో ఉన్నాయి. మామిడికాయ చట్నీ, మామిడికాయ పప్పు.. అలానే మామిడికాయ రసం.. ఇవి తింటే నిజంగానే ఆహా అనకుండా ఉండలేరు.. అలాంటి పచ్చిడి మామిడికాయ రసం ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు..
పచ్చిమామిడికాయ -1,
కందిపప్పు - టేబుల్స్పూన్,
పచ్చిమిర్చి - 1,
పసుపు - 1/2 టీస్పూన్,
ఉప్పు - రుచికి సరిపడినంత,
నెయ్యి - 2 టీస్పూన్లు,
ఇంగువ - పావు టీస్పూన్,
వెల్లుల్లిపాయలు - నాలుగు,
పుదీనా ఆకులు - 1/3 కప్పు,
ఎండుమిర్చి - నాలుగు,
మిరియాలపొడి - పావు టీస్పూన్,
కరివేపాకులు - గుప్పెడు,
బెల్లం తురుము - పావు టీస్పూన్,
రసం పొడి - ఒక టీస్పూన్
తయారీ విధానం...
మామిడికాయ తొక్క పూర్తిగా తీసేసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టాలి. ఆతర్వాత కుక్కర్లో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో పచ్చిమామిడికాయ ముక్కలు, పసుపు, కందిపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేదాకా స్టవ్పై ఉడికించాలి. ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై దాన్ని ఉంచాలి. ఆతర్వాత కిందికి దించి అందులో ఆవిరి పోయేదాకా అలాగే ఉంచాలి.
ఆతర్వాత చిన్న పాన్లో నెయ్యి వేసి అది వేడి అయ్యాక అందులో ఇంగువ వేసి గరిటెతో కదపాలి. తర్వాత అందులో కరివేపాకు, వెల్లుల్లి పాయల పేస్టు, ఎండు మిర్చి వేసి వెల్లుల్లి పేస్టు బ్రౌన్ రంగులోకి వచ్చేదాకా వేగించాలి. ఉడకబెట్టి ఉంచిన పచ్చిమామిడి రసాన్ని, దాల్ని అందులో పోయాలి. వీటితో పాటు బెల్లం, మిరియాలు, రసంపొడులు, పుదీనా ఆకులను వేసి ఉడికించాలి. అంతే మామిడికాయ రసం రెడీ..వేడి వేడి అన్నంలోకి ఈ రసం.. ఆవకాయ వేసుకొని తిన్నారు అంటే ఆహా అనకుండా ఉండలేరు.