ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఇవాళ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడతారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. జి. పెదపూడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారి పేట వెళ్తారు. అక్కడ వరద బాధితులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.


ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ఆ తర్వాత ఉడిమూడిలంక చేరుకుని అక్కడ కూడా వరద బాధితులతో కొద్దిసేపు మాట్లాడటతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని వరద బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం 4.05 గంటలకు సీఎం జగన్ రాజమహేంద్రవరం చేరుకుంటారు.


ఆ తర్వాత రాజమండ్రి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో  అధికారులతో ముఖ్యమంత్రి జగన్  సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో  తీసుకున్న సహాయక చర్యలపై సీఎం జగన్ అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత రాత్రికి  రాజమండ్రిలోనే  ముఖ్యమంత్రి బస చేస్తారు.


అయితే.. ఇటీవలే వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందుగా జగన్ కు వరద బాధిత ప్రాంతాలకు వెళ్లే ఆలోచన లేదని..కానీ.. చంద్రబాబు కూడా వెళ్లాక.. ముఖ్యమంత్రిగా వెళ్లకపోతే బావుండదనే ఆలోచనతోనే జగన్ వెళ్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 75 ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు బాధితులను పరామర్శిస్తే.. కుర్ర సీఎం ఎందుకు ఇల్లు కదలడం లేదని కొన్నిరోజులుగా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు జగన్ పర్యటన కూడా చంద్రబాబు టూర్ ప్రభావమేనని వారు చెబుతున్నారు. ఎవరి ప్రభావమైనా.. బాధితులకు సాయం అందితే అదే పదివేలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: