ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా వారం రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ వారం రోజుల జగన్ పాలన చూస్తుంటే ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. తన పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు జగన్ చర్యలు చేపడుతున్నారు. ప్రతి విషయంలో కొత్తదనం చూపెడుతున్నారు. నిత్యం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనకు అనుభవం లేదని, ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారని చెప్పిన మాటలు అన్నీ ఇప్పుడు నిజం కాదని తేలిపోతున్నాయి. కేవలం వారం రోజుల తన పాలనలో తనేంటో రుజువు చేసుకునే ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
సామాజిక పించన్ల పెంపుపై తొలి సంతకం చేసిన జగన్ ఆ మరుసటి రోజునుండే కిడ్నీ బాధితులకు రూ. 10,000 పెన్షన్, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు వేతనాన్ని రూ. 3000 పెంచడం, ఆశావర్కర్లకు రూ. 3000 ఉన్న వేత నాన్ని ఏకంగా రూ. 10,000 చేయడం వంటి నిర్ణయాలను వేగంగా తీసుకున్నారు. అంతేకాకుండా వాటిని ఆచరణలో పెట్టేశారు. ఈ విధంగా సమాజంలో అట్టడుగు వర్గంలో పనిచేస్తున్న వారి బాధలను పరిష్కరిస్తూనే అధిక రులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తన మంత్రివర్గ కూర్పు చేస్తున్నారు. ఇంకోపక్క తన టీమ్లో ఎవరైతే బాగుంటుందో ఆలోచించుకుని కొంత మంది అధికారులను బదిలీ లు చేయడం, వారి స్థానంలో తన మైండ్సెట్కు అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గ ప్రమాణస్వీకారం, మంత్రివర్గ సమావేశం, అసెంబ్లినిర్వహణ తదితర అంశాలపై వేగంగా నిర్ణయం తీసుకుంటూ అష్టావధాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యలోనే అధికారిక పర్యటలను, ఇఫ్తార్ విందులు చేస్తూ తన పాలనలో వేగాన్ని పెంచుకుంటూపోతున్నారు.
ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని..
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నవ్యాంధ్రకు పరిష్కారం చూపే దిశగా జగన్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటానని ప్రకటించిన జగన్.. తన వ్యక్తిగత ఖర్చులు వేరుగా ప్రభుత్వ ఖర్చులు వేరుగా చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులకు అనవసర ఖర్చులను తగ్గించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం సేవలు జగన్ కోరారు. తాజాగా అజయ్ కల్లంను ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సూచనలు, సలహాలు చేయడంతో పాటు ఆర్థిక మెరుదలకు ఆయన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. సుదీర్ఘ అనుభవం కలిగిన అజయ్ కల్లంను ముఖ్య సలహాదారుగా జగన్ నియమించుకోవడం పట్ల అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న ఆర్థిక సమస్యలను గాడిలో పెట్టేందుకు జగన్ ప్రధాన దృష్టిపెట్టినట్టు ఆయన చర్యలు చూస్తే అర్థమవుతోంది.
తన స్పీడ్కు తగినవాళ్లే..
తన ఆలోచనలను ఎంత వేగంగా అయితే అమలు చేయాలనుకుంటున్నారో.. అంతే వేగంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమర్థులైన అధికారులను ఎంపికచేసుకునే పనిలో జగన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరెవరిని ఎక్కడకు బదిలీ చేయాలి? ఎవరెవరికి ఏయే శాఖలు అప్పగించాలి? అనే విషయంలో నిమగ్నమయ్యారు. వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల్లో చాలా మందికి స్థానచలనం కలగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇంతవరకూ అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వారి దశ మారబోతోంది. వారిని కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించనున్నారు. మరికొందరిని వేరే జిల్లాలకు మార్చనున్నారు. ఈ వారంలో ఎక్కువగా సమీక్షలకే పరిమితమైన నూతన ముఖ్యమంత్రి.. బేషజాలకుపోకుండా భోజన సమయంలో అధికారులతో కలిసి కలివిడిగా మాట్లాడుతూ వాళ్లతో కలిసిపోతున్నారని తెలుస్తోంది. గతంలో తమ శాఖలో జరిగిన అవినీతిని తమ దృష్ఠికి తీసుకొస్తే వెంటనే ప్రొమోషన్ ఇచ్చి అధికారులను సన్మానిస్తానని జగన్ తన రివ్యూ మీటింగ్లో అధికారులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిలోనూ తన తండ్రి వైఎస్ఆర్ మార్క్ కనిపించేలా వ్యవహరిస్తోన్నారని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పలు శాఖల్లో ప్రక్షాళన చేస్తూ ఏపీలో మార్పులు చేస్తున్న ఆయన.. విద్యాశాఖపై కూడా ఫోకస్ పెట్టారు. సంచలన మార్పులకు తెరతీయబోతున్నారు. ప్రభుత్వ బడుల ప్రక్షాలన, మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చి వైఎస్ఆర్ అక్షయపాత్ర పథకంగా పేరు మార్చిన జగన్.. 'నో బ్యాగ్ డే' నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాలతో కుస్తీలను ఒక రోజు పక్కన పెట్టి.. ఆట పాటలతో ఒకరోజు ఉత్సాహపరిస్తే.. మిగతా వారం చదువు పట్ల యాక్టీవ్గా ఉంటారని జగన్ ఆలోచన.
అయితే జగన్ మాత్రం వారం రోజుల పరిపాలనలోనే ముఖ్యమంత్రిగా తన మార్క్ ఏమిటో చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఒక నాయకుడి పనితీరును, అందులోనూ ఓ ముఖ్యమంత్రి పనితీరును వారం రోజుల్లో అంచనా వేయడం చాలా కష్టం. అతిశయోక్తి కూడా. అయితే తొలి వారం ఆయన పనితీరును చూస్తే, భవిష్యత్ పాలనపై ఓ అంచనాకు వచ్చే వీలుంది. తాను ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని మాట ఇచ్చిన జగన్.. ఇంకా ఏమేం సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటివరకైతే ప్రజలకు జగన్ పాలన నచ్చిందనే చెప్పాలి. ఆ దూకుడు మున్ముందు ఎలా ఉండనుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.