నేపాల్ చైనా చేతిలో కీలు బొమ్మగా మారుతోంది.డ్రాగన్ కంట్రీ తాళానికి నేపాల్ తప్పటడుగులు వేస్తోంది. భారత భూభాగాన్ని తన భూభాగంగా చెప్పుకుంటూ నానా రచ్చకు తెరలేపింది. రహస్యంగా నేపాల్కు మద్దతు తెలుపుతున్నట్లుగా చైనా రెండు దేశాల నెలకొన్న వివాదంలో వెనుకుండి కుట్రలు పన్నుతోంది. సమస్యను జటిలం చేసి పొరుగు దేశమైన నేపాల్తో భారత సంబంధాలు దెబ్బతినేలా చేస్తోంది. భారత్పైకి నేపాల్ను ఉసిగొల్పడంలో కీలక పాత్ర వహిస్తోంది. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలు భారతదేశ భూభాగంలోనివేనని పదేపదే ఆధారాలు చూపుతున్నా నేపాల్ మాత్రం నిరాధారంగా, మొండిగా వాదిస్తుండటం గమనార్హం.
భారత్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ను సవరిస్తూ మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం. భారత్కు చెందిన కీలక సరిహద్దు భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురలను నేపాల్ తన అంతర్భాగాలుగా ప్రకటించుకుంది. భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నప్పటికీ దేశ మ్యాప్ను మారుస్తూ రూపొందించిన బిల్లును నేపాల్ పార్లమెంటు దిగువసభ శనివారం ఏకగ్రీవంగా ఆమోదించింది.
నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం అంతర్జాతీయ సమాజం ఆమోదించబోదని అన్నారు. నేపాల్ చర్యను ఏమాత్రం సహించేదిలేదని హెచ్చరించింది. ఇది కయ్యానికి కాలు దువ్వడమేనని అనుకోవాలని విదేశాంగశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది.సరిహద్దు వివాదాలను చర్చలద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న నిబంధనకు వ్యతిరేకంగా నేపాల్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. 1816లో కుదుర్చుకున్న సుగౌలీ ఒప్పందానికి విరుద్ధంగా భారతదేశ ఆధీనంలోని భూభాగాలను నేపాల్ భూభాగంగా చేరుస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది. భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్లోని దర్చులా, లిపులేఖ్ ప్రాంతాలగుండా 80కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే.