ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి.. హామీలు ఇవ్వాలి.. ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పాలి. మరి అలా అన్ని పార్టీలూ చెబుతాయి కదా.. మరి జనం ఎవరిని ఆదరిస్తారు. చెప్పిందే చేస్తాడన్న నమ్మకం ఉన్న వారిని.. తమకు పనికొచ్చేవి చేస్తామన్న నాయకుడిని ఆదరిస్తారు. సహజంగా నాయకులు ప్రజలకు అవసరమైన హామీలు ఇస్తారు. ఆ హామీలు నచ్చిన జనం ఓటేస్తారు. అయితే ఇలాంటి ప్రజాకర్షక హామీలే ఇప్పుడు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయట.


ఈ విషయంపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగబాధపడిపోతున్నారు. తన తాజా కొత్త పలుకులో ఈ విషయంపై చర్చించారు. జగన్, కేసీఆర్ వంటి నాయకుల హామీలతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయట. అందువల్ల ఇలాంటి హామీలు ఇవ్వకుండా.. అమలు చేయకుండా కట్టడి చేయాలట.. అంటే సంక్షేమంపై ఖర్చు చేసే నిధులకు పరిమితి విధించాలట. సరే.. ఇంతకీ ఆ పని ఎవరు చేయాలి.. ఇంకెవరు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణదే ఆ బాధ్యత అని ఆర్కే చెబుతున్నారు.


దేశంలో ప్రస్తుతం న్యాయవ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నందని..  బడ్జెట్‌లో సంక్షేమం పేరిట ఖర్చు చేసే నిధులపై సీలింగ్‌ విధించడానికి చొరవ తీసుకోవడం అవసరమని ఆర్కే సిఫారసు చేస్తున్నారు. పులి మీద స్వారీ చేస్తున్న రాజకీయపార్టీలు తమంత తాముగా ఈ పని చేయబోవని.. అందుకే పరిధిలో లేకపోయినా న్యాయవ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. న్యాయవ్యవస్థ ఇలా చేస్తే రాజకీయ నాయకులే మొదటగా సంతోషిస్తారట. చీకటిలో వచ్చి అభినందనలు తెలుపుతారని ఆర్కేఊహిస్తున్నారు.


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చురుగ్గా వ్యవహరిస్తున్నందున ఈ విషయం ఆలకించాలని ఆర్కే ఆకాంక్షిస్తున్నారు. సంక్షేమంపై పరిమితులు విధించగలిగితే జస్టిస్‌ ఎన్‌వీ రమణ దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారట. చరిత్రలో నిలిచిపోతారని ఆర్కే అంటున్నారు. ఆర్కే విజ్ఞప్తి బాగానే ఉంది.. కానీ ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోకూడదన్నది న్యాయవ్యవస్థ పాటించే మౌలిక సూత్రం.. మరి జస్టిస్ రమణగీత దాటతారా.. దాటి జగన్, కేసీఆర్ వంటి వారిని కట్టడి చేస్తారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: