నిజానికి సోవియట్ యూనియన్ విడిపోయేనాటికి ఉక్రెయిన్ అమెరికా, రష్యాల తరువాత మూడో అత్యధిక అణ్వస్త్రాలు కలిగిన దేశంగా ఉంది. కాగా 1994 డిసెంబర్లో బుడాపెస్ట్ లో జరిగిన ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర నిరాయుధీకరణకు అంగీకరించిన ఉక్రెయిన్ ప్రభుత్వం తనవద్ద ఉన్న అన్ని అణ్వాయుధాలను వదులుకుంది. ఇందుకు ప్రతిగా తనను నాటో సభ్య దేశంగా చేర్చుకుంటారని ఆ దేశం భావించింది. అయితే రష్యా తెలివిగా నాటో కూటమిలోని దేశాలను బెదిరించడం ద్వారా ఇప్పటిదాకా అది జరగకుండా అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు కరోనా పాండమిక్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైన సమయాన్ని ఎంచుకుని ఉక్రెయిన్ ఆక్రమణ మొదలుపెట్టింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి దరిమిలా సంభవించే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయంతో భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రముఖ కంపెనీల షేర్లు సైతం చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఇక రష్యా స్టాక్ మార్కెట్ లో అయితే మదుపరుల సంపద ఏకంగా 250 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. ఇది రూపాయల్లో చెప్పాలంటే రూ. 18 లక్షల కోట్లకు పైమాటే. ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా అన్న భయాందోళనలూ మొదలయ్యాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా సహా నాటో కూటమి దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలకు మాత్రమే పరిమితం కావచ్చు. రష్యాకు వ్యతిరేకంగా ఏదేశం కూడా ఉక్రెయిన్కు సైనిక సాయం అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఉక్రెయిన్ ఎంతోకొంత ప్రతిఘటించినా నిస్సహాయంగా రష్యా ఆక్రమణను అంగీకరించక తప్పకపోవచ్చు.