ఏపీలో ఇప్పుడు పెన్షన్ రాజకీయం నడుస్తోంది. గతంలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఈ పెన్షన్ పంచేవారు.. ఒకటో తారీఖు ఉదయం కల్లా వృద్ధులకు పెన్షన్లు వచ్చేసేవి. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. వాలంటీర్లను ఇలాంటి విధులకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పింది. వాస్తవానికి ముందే ఎన్నికలు వస్తాయని జగన్ ఆశించారు. కానీ ఈసీ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చి ఎన్నికలు మేలో పెట్టేసింది.
అప్పటి వరకూ మెయింటైన్ చేసేందుకు ఏపీ ఖజానా ఖాళీగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ రెండు నెలలు ఎలా కవర్ చేయాలో జగన్ తెలియక తంటాలు పడుతున్నారని... వాలంటీర్లను ఎలాగూ ఈసీ నియంత్రిస్తుందని తలుసు కాబట్టి వృద్ధాప్య పెన్షన్లను లేటు చేసేందుకు పెద్ద ప్రణాళికే వేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పటికే ఖాతాల్లో ఉన్న డబ్బులన్నింటినీ ఎన్నికల కోడ్ ఉన్నా.. తమ అనుకూలురైన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అందుకే సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల జీతాలకు మాత్రం జగన్ ఆర్బీఐ అప్పుల మీద ఆధారాపడాలనుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన బిల్లులు చెల్లించేస్తున్నారని.. కానీ పెన్షన్లకు మాత్రం నిధులు ఇవ్వలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో వాలంటీర్లపై ఈసీ పెట్టిన రూల్స్ ను జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారట.
ఇలాంటి పరిస్థితుల్లో కోడ్ ఉన్నప్పుడు.. లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు నేరుగా జమ చేయవచ్చు. లేదా ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేయవచ్చు. కానీ అందరూ గ్రామ సచివాయాలకు వచ్చి తీసుకోవాలని సెర్ప్ ఆదేశాలు జారీ చేయడం కూడా జగన్ రాజకీయంలో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కూడా పరిమితం చేయాలని గతంలో ఈసీ సూచించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ సామాజిక పెన్షన్ల కోసం కనీసం 1900 కోట్లు అవసరం కాగా.. ఖజానాలో నాలుగైదు వందల కోట్లు కూడా లేవట. అందుకే సాధ్యమైనంతగా ఈ పెన్షన్లను టీడీపీ ఆపుతోందనే ప్రచారం మొదలు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.