ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో కొన్నిదేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. అలాగే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3.25లక్షల బలైపోయారు. ఇంకెంత మందిని కరోనా బలి తీసుకుంటుందో అర్థంకాని పరిస్థితి. మరోవైపు కరోనా కంటికి కనిపించకపోయినా.. చేతిలో ఆయుధం లేకపోయినా ప్రపంచదేశాలు దీనితో పోరాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు.
లక్షల మంది ప్రాణాలు పొట్టనపెట్టుకున్నా.. కరోనా ఆకలి తీరడం లేదు. ఇక ఈ మహమ్మారికి ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా అడ్డుకట్ట పడుతుందో తెలియక దేశదేశాలు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. ప్రస్తుతం భారత్లో కరోనా కేసులు సంఖ్య లక్ష దాటిపోయింది. ఇక ప్రస్తుతం ఇక్కడ నాలుగో దశ లాక్డౌన్ అమలవుతోంది. అయితే దేశవ్యాప్తంగా నిలిచిపోయిన రాష్ట్రాల బోర్డుల పరీక్షలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కోసం కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు.
అయితే స్కూళ్లు, కాలేజీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూనే.. కొన్ని కండిషన్లు కూడా విధించారు. అందులో ముందుగా.. టీచర్లు, పరీక్షల సిబ్బంది, విద్యార్థులు అందరూ ఫేస్ మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. చాలా బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటిస్తున్నందున వాటిపై విద్యార్థులకు సంశయం లేకుండా చూడాలి. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను వినియోగించవచ్చు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి.