దాదాపు గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్‌ మహమ్మారి నిర్మూలనకు మరికొద్ది వారాల్లో టీకా అందుబాటులోకి వస్తుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి నాటికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా, భారత్ బయోటెక్ టీకాలు, ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నాలుగు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది జులై నాటికి దాదాపు 30 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఇదిలా ఉండగా.. ఇప్పటికే కోవిషీల్డ్ (ఆక్స్‌ఫర్డ్ టీకా) అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసినట్టు పీటీఐ వెల్లడించింది. ఒకవేళ క్లినికల్ ఫలితాలు విశ్లేషణ స్పష్టంగా ఉంటే భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్ జనవరి చివరి లేదా ఫిబ్రవరి తొలివారంలో అందుబాటులోకి రానుంది. ఫైజర్ ఇండియా దరఖాస్తును కూడా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, భారత్‌కు సరఫరా చేసే టీకా డోస్‌ల పరిమితిపై స్పష్టత ఇస్తేనే కేంద్రం అనుమతించనుంది. రష్యా టీకా స్పుత్నిక్-వీ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ‘ఏప్రిల్ నాటికి దేశంలో కనీసం నాలుగు వ్యాక్సిన్లు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. కాబట్టి, జూన్-జూలై నాటికి ప్రాధాన్యత సమూహానికి వ్యాక్సినేషన్‌కు తగినంత టీకాలు అందుబాటులో ఉండాలి’ అని ఓ సీనియర్ అధికారి అన్నారు.


బ్రిటన్, బహ్రెయిన్‌లు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో భారత్‌లోనూ ఆ సంస్థ దరఖాస్తు చేసింది. ఫైజర్ దరఖాస్తుపై డీసీజీఐకి చెందిన నిపుణుల కమిటీ వచ్చే వారంలోనే పరిశీలించనుంది. ఫైజర్ దరఖాస్తుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మా దగ్గర టీకాలు ఉన్నాయి.. ఇవి చాలా సులభమై విధానంలో అభివృద్ధి చేస్తున్నాం.. స్థానికంగా తయారు చేయడం వల్ల సేకరణ, సరఫరా, పంపిణీ, లాజిస్టిక్స్ మాకు సులభతరం చేస్తుంది’ అని సీనియర్ అధికారులు వ్యాఖ్యానించారు. ఇక, రాబోయే ఐదారు నెలల్లో 40 కోట్ల కోవిషీల్డ్ డోస్‌లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో జులై నాటికి 30 కోట్ల మందికి టీకా వేయాలంటే 60 కోట్ల డోస్‌లు అవసరమవుతాయి. కోవాగ్జిన్, స్పుత్నిక్-వీకి ఆమోదం లభిస్తే ఈ సంఖ్యను సేకరించడం మరింత సులభతరం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: