సినిమా రంగంలో సెంటిమెంట్కు అధిక ప్రాధాన్యత ఇస్తారు సిని ప్రముఖులు. తమ సినిమాలు పూజా కార్యక్రమం నుంచి మొదలు.. సినిమా విడుదల వరకు అన్ని అనుకున్న మూహూర్తాలకు.. తమకు కలిసొచ్చే సెంటిమెంట్ను నమ్ముకుని చేసుకుంటున్నారు. అంతే కాదు తాము కొనుగోలు చేసే వాహానాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్ విషయంలోనూ ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతారు.. అంతలా ఈ సెంటిమెంట్ పిచ్చి సిని ప్రపంచంలో బలంగా ఉంది. టాలీవుడ్లో కూడా ఇదే సెంటిమెంట్ను ఫాలో అయ్యారు అగ్ర హీరోలు. అందులో సూపర్స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు లాంటి హేమాహేమీలైన హీరోలు కూడా సెంటిమెంట్ ను నమ్ముకుని తమ సిని ప్రస్థానాన్ని సాగించారు.
ఇక వీరి అడుగు జాడల్లోనే నడుస్తున్నారు నేటి తరం హీరోలు, దర్శకులు, హీరోయిన్లు. అందులో ప్రధానంగా చూసుకుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్, నాగచైతన్య, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు పలువురున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రిన్స్ మహేష్బాబు సెంటిమెంట్ విషయంలో బాగా ఫాలో అవుతున్నారు. సూపర్స్టార్ మహేష్బాబు తాను నటించిన మహర్షి సినిమా నుంచి ఈ సెంటిమెంట్ను బలంగా నమ్ముతున్నాడు. అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ తన వాహాన రిజిస్ట్రేషన్ నంబర్ లో 9 సంఖ్య వచ్చేలా చూసుకుంటాడు. అదే విధంగా మహేష్ బాబు కూడా 9 సంఖ్యపై ఇప్పుడు బాగా గురి కుదిరినట్లుంది.
అందుకే ఇప్పుడు మహేష్బాబు తన సినిమా సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా అంతా 9 సంఖ్య వచ్చేలా చేస్తున్నారు. మహర్షి సినిమా నుంచి మహేష్బాబు ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. అది సెంటిమెంట్ వైపు దారి తీసింది. తన అదృష్ట సంఖ్య 9గా చూసుకుంటున్నారు మహేష్బాబు. ఒక సారి మహేష్బాబు తన అదృష్ట సంఖ్యను ఎంచుకోవడానికి మహర్షి సినిమాతోనే ప్రారంభించారు. అది ఎలా అయిందో ఓసారి చూద్దాం. మహర్షి సినిమాను మే9న విడుదల చేయగా.. ఆ మూవీ పాటలు, పోస్టర్లు, టీజర్ విడుదల సమయాల్లోనూ 9 గానీ, దాని గుణింతాలు(అంటే 18) వచ్చేలా చూసుకున్నాడు. అంటే మహర్షిలోని చోటి చోటి బాతే, నువ్వే సమస్తం, పదర పదర ఈ పాటలన్నీ సాయంత్రం గం.4.05నిమిషాలకు విడుదలయ్యాయి. వాటిని కలిపితే (4+5)9 వస్తుంది.
అలాగే 'మహర్షి' టీజర్ను గం.9.09లకు విడుదల చేశారు. ఇలా ఆ సినిమా పోస్టర్లు, టీజర్ల విడుదల సమయం 9 గానీ, 9 గుణింతాలతో గానీ ఉంది. మహర్షి సినిమా అయితే ఎలా 9 సంఖ్యను ఫాలో అవుతూ సెంటిమెంట్గా మార్చుకున్నాడో.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో కూడా అదే ఫాలో అవుతున్నాడు మహేష్. ఈ సినిమా టీజర్ నవంబర్ 22న సాయంత్రం గం.5.04 నిమిషాలకు విడుదల కాగా.. ఇవాళ మైండ్ బ్లాక్ అంటూ సాగే మొదటి పాట కూడా అదే సమయానికి రిలీజ్ అవ్వబోతోంది. అంతేకాదు మిగిలిన పాటలు కూడా ఇలానే విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు అదే సెంటిమెంట్తో విడుదల చేసిన పాట కూడా బాగానే ట్రెండ్ అవుతుంది. ఈ పాట ట్రెండ్ అవుతుండటంతో సెంటిమెంట్ బాగానే అక్కరకు వచ్చిందనే టాక్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో జోరుగా వినిపిస్తుంది.
ఇక సినిమాలోని మిగతా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇదే విధంగా సెంటిమెంట్ సంఖ్యతోనే నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే. ఇంతకు ముందు 9 సెంటిమెంట్ మహర్షి చిత్రానికి బాగానే వర్కౌట్ అవ్వగా.. సరిలేరు నీకెవ్వరుకు ఏ మాత్రం అచ్చొస్తుందో చూడాలంటే ఇంకో నెల రోజులకు పైగా వేచి చూడాల్సిందే. సరిలేరు నీకెవ్వరూ కు ఈ సంఖ్య వర్కౌట్ అయిందంటే ఇక భవిష్యత్లో మహేష్బాబు తన అదృష్ట సంఖ్యగా 9ని పర్మినెంట్ చేసుకున్నట్లే లెక్క అని చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది. సో మహేష్ బాబుకు సెంటిమెంట్ కలిసొచ్చేనా లేదా చూద్దాం.