టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రయోగాత్మక సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇష్టపడే అక్కినేని నాగార్జున గత కొంతకాలంగా భారీ డిజాస్టర్లు చవి చూస్తున్నారు. మన్మధుడు 2, వైల్డ్ డాగ్ చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో నాగార్జున తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు. అయితే ఇకపై ఆయన ఎక్స్పీరిమెంట్స్ చేయదలచుకోలేదు అని తెలుస్తోంది. రెగ్యులర్ సినిమా పరిశ్రమలో ఎక్స్పెరిమెంట్స్ చేయడం వదిలేసి డిజిటల్ రంగంలో ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇటీవల ఆయన ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ విన్నారని ఆ స్క్రిప్ట్ తో ఒక సినిమా చేయాలని సిద్ధమయ్యారని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాని నిర్మించడం తో పాటు ఆయన ఒక పాత్రలో నటించనున్నారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారట. వాస్తవానికి, రొటీన్ సినిమాలకు భిన్నంగా వైల్డ్ డాగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైనప్పుడు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో నాగార్జున మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తే.. వాటిని డిజిటల్ ప్రేక్షకులు ఆదరిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన తన సొంత డబ్బులతో కథాబలం ఉన్న సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. బంగార్రాజు సినిమా షూటింగ్ ని ఏడాది చివరిలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలన్నీ పూర్తి చేసిన అనంతరం ఆయన మంచి కథలతో డిజిటల్ ఫిలిమ్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను నాగార్జున మెప్పించగలరా లేదా అనేది చూడాలి. ఇకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్, లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: