మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు క్యూనెట్ ఫ్రాంచైజీ విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై నమోదైన 14 కేసుల్లో దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట ‘క్యూనెట్’ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ‘క్యూనెట్’ కేసులో పలువురు ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. పలువురు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లకు, క్రికెటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వీరిలో శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్, సినీ రంగ ప్రముఖులు బొమన్ ఇరానీ, షారుక్ ఖాన్, అల్లు శిరీష్, పూజా హెగ్డేతో పాటు క్యూనెట్ కంపెనీ సీఈవోలు, డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, క్రికెటర్లు దాదాపు 500 మంది ఉన్నారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వీరిచ్చే సమాచారం ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
క్యూనెట్ కేసులో పోలీసుల దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 3 లక్షల మందిని మోసగించినట్లుగా తెలుస్తోందన్నారు. కాగా, ‘క్యూ నెట్’కు ప్రచారం చేసి కస్టమర్లను ఆకర్షించేలా చేసిన వారు కూడా నేరస్తులేనని పోలీసులు అంటున్నారు. ‘క్యూ నెట్’ ద్వారా లబ్ధి పొందిన వారిని కూడా విచారణకు పోలీసులు పిలిచినట్టు సమాచారం.జ నవరి తొలి వారంలో 14 కేసుల్లో 58 మందిని అరెస్టు చేసి ఆ కంపెనీకి చెందిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.2.7 కోట్లు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విహన్ డైరెక్ట్ కంపెనీ డైరెక్టర్తో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు.