ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఒక పక్క విమర్శల బాణాలు సంధిస్తూనే.. మరోపక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలుస్తోంది. కుమారుడు కేటీఆర్ ని సీఎం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉపయోగించిన పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లారని సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరంలో కేసీఆర్ దంపతులు ఏం కలిపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో టీఎంసీ అంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని... మూడో టీఎంసీతో వచ్చే లాభమేమిటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
                ఇటీవల పలువురు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ సీఎం కావాలంటూ విన్నవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాటిపై బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని... కేటీఆర్ సీఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని సంజయ్ అన్నారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
                                   కేటీఆర్ సీఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని సంజయ్ కుమార్ చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని ఇష్టపడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామని సంజయ్ ఆహ్వానించారు. అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని సంజయ్ స్పష్టం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... ఇప్పటికైనా ఆ పని చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజలు కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబ బాగుకోసమేనని... తాము చేసే పూజలు సమాజ హితం కోసమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: