ఇటీవల పలువురు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ సీఎం కావాలంటూ విన్నవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాటిపై బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని... కేటీఆర్ సీఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని సంజయ్ అన్నారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
కేటీఆర్ సీఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని సంజయ్ కుమార్ చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని ఇష్టపడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామని సంజయ్ ఆహ్వానించారు. అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని సంజయ్ స్పష్టం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... ఇప్పటికైనా ఆ పని చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజలు కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబ బాగుకోసమేనని... తాము చేసే పూజలు సమాజ హితం కోసమని బండి సంజయ్ స్పష్టం చేశారు.