కట్ చేస్తే.. ఎన్నికలు పూర్తై రెండేళ్లు గడిచాయి, అధికార వైసీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. ఈ దశలో వైసీపీతో తప్పులు చేయించేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వరుసగా టీడీపీ నేతల అరెస్ట్ ల వ్యవహారాన్ని హైలెట్ చేయాలని చూసినా అది వర్కవుట్ కావడంలేదు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర.. తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అరెస్ట్ ల వ్యవహారంలో కూడా టీడీపీ ఇలాగే స్పందించింది. రాజకీయ కక్షసాధింపులంటూ మండిపడింది. అయితే అరెస్ట్ ల విషయంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కారణాలుండటంతో టీడీపీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
మరోవైపు జగన్ ని పదే పదే రెచ్చగొట్టినా స్పందన లేదు. చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలంతా జగన్ ని ప్రతిరోజూ విమర్శిస్తున్నవారే. కానీ ఎప్పుడూ జగన్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందించలేదు. వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు కానీ, జగన్ ఇంకా రంగంలోకి దిగలేదు. అంటే ఒకరకంగా ప్రతిపక్షాలను ఆయన పూర్తిగా విస్మరించారనే చెప్పాలి. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా చూసుకుంటున్నారు. ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజలకు ఆర్థిక సాయం అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఇదంతా ఒకరకంగా టీడీపీకి ఇబ్బందిగా మారింది. 2024 ఎన్నికలకు ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి, ఏ విషయాలపై నిలదీయాలి.. అనేదానిపై కసరత్తులు చేస్తున్నారు.
అన్న క్యాంట్లీన్లు మూశారు, మందు రేటు పెంచారు, పీఆర్సీ వేయలేదు, జగన్ మాస్క్ పెట్టుకోడు.. ఇలా రకరకాల కారణాలు చెప్పొచ్చు కానీ, ఇవేవీ ఓటర్లను వైసీపీనుంచి దూరం చేసేవి కావు. అందుకే రెండేళ్లు గడిచినా ఇంకా ఏపీలో ప్రతిపక్షానికి ఏ ఆదరువూ దొరకలేదు. ఒకరకంగా ప్రతిపక్షాలను ఈ రెండేళ్లలో పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేశారు సీఎం జగన్.