సాధారణంగా మంత్రులుగా పనిచేసిన వారు ఆ తర్వాత ఎన్నికల్లో తిరుగులేకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించాలి. అయితే కొందరు మంత్రులు మాత్రం మంత్రిగా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగినా... నియోజకవర్గంపై నిర్లక్ష్యం చూపిస్తారు. దీంతో వారు మంత్రులుగా ఉండి ఓడిపోతూ ఉంటారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు - నిమ్మకాయల చినరాజప్ప లాంటి ఒకరిద్దరు మంత్రులు మినహా అందరు మంత్రులు ఓడిపోయారు.

రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా ఉన్నా నియోజకవర్గంలో బలోపేతం కాకపోవడంతో పరాజయం తప్పలేదు. ఇక ఇప్పుడు ఏపీ మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే కొందరు మంత్రులకు సొంత నియోజకవర్గంలో షాకులు తప్పేలా లేవు.

ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో మళ్లీ గెలిచే మంత్రులు చాలా తక్కువగా ఉన్నారని తెలుస్తోంది. పలాసలో అప్పలరాజు - కురుపాం లో పుష్ప శ్రీవాణి - భీమిలిలో అవంతి శ్రీనివాస్ - కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు - అమలాపురంలో విశ్వరూప్ - ఏలూరు లో ఆళ్ల నాని - కొవ్వూరులో తానేటి వనిత - ఆచంటలో రంగనాథరాజు - బందరు లో పేర్ని నాని - విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ - ప్రత్తిపాడులో సుచరిత - నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ - జీడీ నెల్లూరు లో నారాయణ స్వామి - ఆలూరులో గుమ్మనూరు జయరాం - ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి - పెనుగొండలో శంకర్ నారాయణ వీరంతా కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ రెండున్నర సంవత్సరాలలో ఈ మంత్రుల నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి ప్రత్యర్థులుగా ఉన్నవారు కూడా చాలావరకు పుంజుకున్నార‌న్న వాతావరణం కనిపిస్తోంది. అయితే డేంజర్ జోన్ లో ఉన్న మంత్రుల్లో ఎక్కువమంది టిడిపి - జనసేన పొత్తు కుదిరితే ఓడిపోయే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులపై టిడిపి - జనసేన పొత్తు స్పష్టంగా కనిపించనుంది. ఇక కొడాలి నాని - బుగ్గన రాజేంద్రనాథ్ - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - ధర్మాన కృష్ణదాస్ - మహమ్మదుల్లా లాంటి నేతలకు మాత్రం ప్రస్తుతానికి ఇబ్బంది అయితే కనిపించడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: