గుడివాడలో టీడీపీ మినీ మహానాడు జరగలేదు. అక్కడ వాతావరణం అనుకూలించలేదు. ఒక్కసారిగా గాలి దుమారం రేగింది.. సభ పెట్టే అవకాశం లేకపోవడంతో మినీ మహానాడు వాయిదా పడింది. అయితే ఎన్టీఆర్ ఆత్మే వాతావరణం మార్చి మహానాడు జరగకుండా చేసిందని అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. తనను దేవుడిలా కొలిచే కొడాలి నానిని చంద్రబాబు ఓడిస్తానని అనడం ఎన్టీఆర్ ఆత్మకు ఇష్టం లేదని, అందుకే ఆయన ఆత్మ అక్కడ సభ జరగకుండా అడ్డుపడిందని చెప్పారాయన. చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదని ఎద్దేవా చేశారు నాని. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం పెద్ద మహానాడు తర్వాత మినీ మహానాడులు చేస్తున్నారని, ఆయన తెలివి తక్కువ తనానికి ఇదే నిదర్శనం అని అన్నారు నాని.

గుడివాడలో తనను ఓడించాలంటే తుప్పు నాయుడు, పప్పునాయుడు వచ్చినా కుదరదని చెప్పారు నాని. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటోందని, ఎమ్మెల్యేగా తాను అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నానని అన్నారు. చంద్రబాబు ఇలా వచ్చి అలా వెళ్లేవారని, గుడివాడ ప్రజలు ఆయన్ను పిచ్చి కుక్కలా చూస్తున్నారని చెప్పారు నాని. కుప్పంలో గెలిచే దిక్కులేని చంద్రబాబు.. ఇప్పుడు గుడివాడ రావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు నాని. డబ్బులు ఉన్నాయి కదా అని గుడివాడ వస్తే కుక్కకాటుకి చెప్పుదెబ్బలా ప్రజలు రాబోయే ఎన్నికల్లో మళ్లీ బాబుని ఓడిస్తారని హెచ్చరించారు.

ఎంత మంది దిగొచ్చినా గుడివాడలో కొడాలిని ఏం చేయలేరని చెప్పారు నాని. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఆయనపై అభిమానం ఉన్నవారిని కాదనే అధికారం ఎవరికీ లేదన్నారు నాని. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని, ఆయన విగ్రహానికి ఏ రంగులైనా వేసుకోవచ్చని అన్నారు. తాము ప్లీనరీ పెట్టుకున్నామని, అందుకే హోర్డింగ్ లు పెట్టామని అన్నారు నాని. చంద్రబాబు వస్తున్నాడని తాము పబ్లిసిటీ ఇవ్వడంలేదని చెప్పారు. ఎన్టీఆర్ జనం మనిషి అని, ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేయొచ్చని వివరణ ఇచ్చారు. అసలు ఆ మాటకొస్తే ఎన్టీఆర్ కి టీడీపీకి సంబంధం లేదన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి లెటర్ తీసుకొచ్చి టీడీపీ నుంచి ఎన్టీఆర్ ని బహిష్కరించారని,  ఇంకా ఎన్టీఆర్ కి టీడీపీ సంబంధం ఏముందని అన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పి మళ్లీ రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని, ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని చెప్పారు నాని.


మరింత సమాచారం తెలుసుకోండి: