తన మాటకారి తనం తో అందరినీ ఆకర్షించగల నేత , కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు అంతర్జాతీయంగా ఎదిగారు. అంతర్జాతీయంగా తన గొంతు వినిపించే ఛాన్స్ ని సాధింకాహరు ఆయన. ఐక్యరాజ్య సమితి ఆవాస పాలకమండలి ఛైర్మన్గా వెంకయ్యనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెన్యా రాజధాని నైరోబీలో నిర్వహించిన ఐక్య రాజ్య సమితి హ్యాబిటేట్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను ఎన్నుకుంది. ఈ కౌన్సిల్లో మొత్తం 58 దేశాల ప్రతినిధులు సభ్యులు. నాలుగు రోజులపాటు సాగే కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహిస్తారు.
ఈ కౌన్సిల్ 1978లో ఏర్పాటైంది. ఓ భారతీయుడు దీనికి ఛైర్మన్గా ఎన్నికవడం ఇది మూడో సారి. 1988, 2007 సంవత్సరాలో భారతీయులు ఛైర్మన్గా వ్యవహరించారు. పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన రంగాలలో వెంకయ్య నాయుడు చేసిన కృషి ఆయనకు ఈ పదవిని కట్టబెట్టింది. ఐరాస ఆవాస పాలక మండలి ఛైర్మన్ పదవికి ఆయన పేరును ప్రతిపాదించింది. ఇతర దేశాలు ఆయన పేరును ఆమోదించడంతో వెంకయ్య ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండేళ్ల పాటు వెంకయ్య నాయుడు ఆ పదవిలో కొనసాగుతారు.
రానున్న పదే సంవత్సరాల్లో నిరు పేద దేశాల్లోని పేదలకు నివాసాల కల్పనకు ఈ కౌన్సిల్ కృషి చేస్తుంది. అందుకు తగ్గ వ్యూహాలను రూపొందిస్తుంది. కార్యాచరణ ప్రణాళికనూ రూపొందిస్తుంది. అన్ని దేశాలూ దాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మినహా కనీస ఆవాసాలు లేని దేశాలు చాలనే ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ సమస్య అత్యంత ఎక్కువగా ఉంది. కొన్ని ఆసియా దేశాల్లోనూ దీని ప్రభావం ఉంది.