నిన్నటి వరకు హైదరాబాద్లో సంచలనం కలిగిస్తోన్న బ్యూటీషియన్ శిరీష మృతి కేసు గురించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. బ్యుటిషియన్ శిరీష ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై ఎన్నో అనుమానాలు కలిగాయి. మొన్నటి వరకు శిరీషపై అత్యాచారం జరిగిందని రక రకాల వార్తలు వచ్చాయి. ఈ రోజు మీడియా సమావేశంలో శిరీష మృతి..ఎస్సై ప్రభాకర్ మృతిపై పూర్తి వివరాలు తెలిపారు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి.
ఈ నెల 12న మృతురాలు శిరీష, రాజీవ్, శ్రవణ్ లు కుకునూరు పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డిని కలిసినట్లు వారు అక్కడ మందు సేవించడం..ఆ సమయంలో శిరీషపై ఎస్సై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేయడం జరిగింది. విషయం తెలుసుకున్న రాజీవ్, శ్రవణ్ లు అక్కడకు వచ్చి శిరీషను కారులో తీసుకు రావడం జరిగింది. ఆ సమయంలో ఎస్సై రాజీవ్ కి ఫోన్ చేసి శిరీష పరిస్థితి తెలుసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ నెల 13న ఉదయం 8.30కి ప్రభాకర్ రెడ్డి ఓ పోలీసుకి పలు సార్లు ఫోన్ చేసి ఈ కేసులో వివరాలు తెలుసుకున్నాడని అన్నారు.
ఈ కేసులో శిరీష భర్త నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారని, మీ దగ్గరకు వచ్చి మద్యం తాగారని నిందితులు పోలీసులకి చెబుతున్నారని ప్రభాకర్ రెడ్డికి ఓ పోలీసు తెలిపారని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పలు చానల్స్ లో శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రావడంతో తన ప్రవర్తన వల్లే శిరీష ఆత్మహత్య చేసుకుందని, తనపై విచారణ ప్రారంభమవుతుందని భావించిన ప్రభాకర్ రెడ్డి ఎంతో ఒత్తిడికి గురయ్యారని అన్నారు.
దీంతో ఎస్సై ప్రభాకర్ రెడ్డి అదే రోజు ఉదయం తన సర్వీస్ రివాల్వర్ తోనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా తమ మద్య వివాదాన్ని పరిష్కరించుకునే క్రమంలో ఇద్దరు నిండు ప్రాణాలు కావడం విషాదాన్ని మిగిల్చిందని ఇక్కడ శిరీష.. అక్కడ ప్రభాకర్ రెడ్డి గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని అన్నారు.