తెలంగాణాలో టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు త్వరలో ఏపిలో పర్యటించునున్నారు. తెలంగాణా టిడిపి వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబుపై ఎస్సీ నేత మోత్కుపల్లి బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబుపై మోత్కుపల్లి భయంకరంగా ఎన్టీఆర్ జయంతి రోజున విరుచుకుపడ్డారు. దాంతో వెంటనే ఆయన్ను పార్టీ నుండి బహిష్కరించారు. అప్పటి నుండి చంద్రబాబుపై అవకాశం దొరికినపుడల్లా వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
అయితే, చంద్రబాబుపై మోత్కుపల్లికి ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంతగా మండిపోతున్నా చేయగలిగేది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కారణం ఏమిటంటే, మోత్కుపల్లి తెలంగాణా నేత అయితే, చంద్రబాబు ఏపి ముఖ్యమంత్రి. అందుకే చంద్రబాబును ఇబ్బంది పెట్టటానికి త్వరలో ఏపిలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపధ్యంలోనే చంద్రబాబంటే ఏమాత్రం పడని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మోత్కుపల్లిని కలిశారు. ఇద్దరూ కలిసి ఏపిలో పర్యటించాలని అనుకున్నారు.
ఖరారు కానున్న పర్యటనలు
ఇదిలావుండగానే వైసిపిలోని కొందరు నేతలు కూడా మోత్కుపల్లితో టచ్ లో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో బాగా పలుకుబడి కలిగిన మోత్కుపల్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తిప్పాలని వైసిపిలోని కొందరు నేతలు ఆలోచించారు. అందులో భాగంగానే మోత్కుపల్లికి ఏపికి వచ్చి పర్యటించాలని కోరారు. అందుకు మోత్కుపల్లి కూడా సానుకూలంగానే ఉన్నారు. ఏ నియోజకవర్గాల్లో మోత్కుపల్లి పర్యటించాలి ? పర్యటన ఎప్పటి నుండి మొదలుపెట్టాలి ? అన్న విషయాలపై క్లారిటి వస్తే వెంటనే పర్యటన ఖరారు అవుతుందని సమాచారం. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎస్సీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలు ఏర్పాటు చేయాలని వైసిపి నేతలు భావిస్తున్నారు. సో, చంద్రబాబుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఇపుడున్న నేతలకు బోనస్ గా మోత్కుపల్లి కూడా తిరుగటం ఖాయమని అర్ధమైపోయింది.