వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటానికి తెలంగాణా రాష్ట్ర సమితి చీఫ్ పెద్ద మాస్టర్ ప్లానే వేసినట్లు అర్ధమవుతోంది. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటంటే, కాంగ్రెస్ నేతలపైకి పోలీసులను ఉసిగొల్పటం. మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసినట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది. ఆయధ చట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంకట్రమణారెడ్డిపైన కూడా పోలీసులు సోమవారం రాత్రి ఆయుధ చట్టం క్రింద కేసు పెట్టారు
ఎప్పుడో అంటే 2001లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పోలీసులు రేవంత్ కు నోటీసులు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2001లో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటిలో ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలకు రేవంత్ కారణమంటూ పోలీసులు ఇపుడు నోటీసులివ్వటం ఆశ్చర్యంగా ఉంది. కొందరికి ప్లాట్లు కేటాయించే ఉద్దేశ్యంతో రేవంత్ వారి నుండి తప్పుడు పత్రాలు తీసుకుని ప్లాట్లు కేటాయించేశారట. ఆ కేసుకు సంబంధించే ఇపుడు పోలీసులు యాక్టివేట్ అయ్యారు.
పోలీసుల తీరు చూస్తుంటే ఈరోజో రేపో రేవంత్ ను కూడా అరెస్టు చేసేట్లున్నారు. ఎప్పటిదో కేసును హటాత్తుగా ఇపుడు బయటకు తీసిన పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇపుడు రేవంత్ వంతు వచ్చిందన్నమాట. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తారనో లేకపోతే గట్టి పోటీ ఇచ్చే నేతలనో అనుకున్న వారిని టిఆర్ఎస్ గుర్తించి ఏదో ఒక మార్గంలో ఎన్నికల నుండి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మొన్న జగ్గారెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజు లేదా ఎన్నికల నామినేషన్లు వేసేంతలో గా ఇంకెంతమంది కాంగ్రెస్ నేతలపై టిఆర్ఎస్ గురిపెట్టిందో చూడాల్సిందే.