అది ఫిబ్రవరి 26.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతం.. భారత్లోని వివిధ వైమానిక స్థావరాల నుంచి ఒకే సమయంలో వాయు సేన యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. పాకిస్థాన్లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఎంతో చాకచక్యంగా పని ముగించుకుని తిరిగి స్వదేశానికి క్షేమంగా చేరుకున్నాయి.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి చేసిన విషయం తెలిసిందే. ఎంతో రహస్యంగా సాగిన ఈ ఎయిర్ స్ట్రైక్స్కు వైమానిక దళం ఓ కోడ్ పెట్టుకుందట. అదే ‘ఆపరేషన్ బందర్’. ‘బందర్ అంటే వానరం. భారత యుద్ధ చరిత్రలో వానరానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఓ సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే భారత వాయుసేన బాలాకోట్ ఆపరేషన్ జరిపింది. ఫిబ్రవరి 26న 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై అత్యంత శక్తిమంతమైన బాంబులను జారవిడిచింది.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పాక్ వాయుసేన భారత్పై ప్రతిదాడికి దిగింది. భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో పాక్ విమానాలు బయల్దేరాయి. అయితే దీనిని ముందుగానే అంచనా వేసిన భారత్.. పాక్ విమానాలు ను తరిమికొట్టింది.