తెలుగుదేశంపార్టీతో పాటు
బయట కూడా ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది.
పార్టీ సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన అన్నం సతీష్
ప్రభాకర్ తర్వాత లోకేష్ పై ఫుల్లుగా ఫైరయ్యారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని
లోకేష్ ను చంద్రబాబునాయుడు మంత్రిని చేసి అందరిపై బలవంతంగా రుద్దినట్లు సతీష్ మండిపోయారు.
సతీష్ కామెంట్లతో చంద్రబాబు, లోకేష్ కు పెద్ద షాకే తగిలినట్లైంది. ఎందుకంటే వారిద్దరికీ సతీష్ బాగా సన్నిహితుడవటం గమనార్హం. పార్టీలో ఉన్నంత వరకూ ఇద్దరికీ సతీష్ వీర విధేయునిగా ఉండేవాడు. అలాంటిది రాజీనామా చేసిన వెంటనే ఇద్దరికీ రివర్సుగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా తనతో పాటు చాలామంది రాజీనామాలు చేయబోతున్నట్లు పెద్ద బాంబు పేల్చారు.
గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి అన్నం ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజాతీర్పు తనకు వ్యతిరేకంగా ఉన్నా ఎంఎల్సీగా శాసనమండలిలోకి ప్రవేశించటానికి తన మనసు అంగీకరించటం లేదన్నారు. రాజీనామా అంశాన్ని కారణంగా ఎప్పుడైతే తెరపైకి తెచ్చారో వెంటనే అందరి చూపులు ఇపుడు నారాలోకేష్ పై పడ్డాయి.
ఎంఎల్ఏగా ఓడిపోయిన లోకేష్ ఎంఎల్సీ గా ఎలా కంటిన్యు అవుతాడని సతీష్ సూటిగా ప్రశ్నించటం లోకేష్ మింగుడుపడని అంశమే. ఈ విషయంలోనే లోకేష్ రాజీనామా అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. ఎన్నికలకు ముందే సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి ఎంఎల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లోకేష్ కూడా మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి లో పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేయాలని సతీష్ డిమాండ్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది.