ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన అయోషా హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో ముద్దాయిగా భావించబడ్డ సత్యంబాబు ని కోర్టు నిర్ధోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాజకీయ కోణంతో అప్పట్లో ఎన్నో సంచలన కథనాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు అయోషా కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 12 ఏళ్ల తర్వాత ఆయేషా మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం చేయనుంది.
సీబీఐ తమకు కూడా డీఎన్ఏ టెస్ట్ చేసిందని ఆయేషా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆయేషా డీఎన్ఏ టెస్ట్కు తమ మతపెద్దలు ఒప్పుకోలేదని, కోర్టు ద్వారా సీబీఐ అనుమతి తెచ్చుకుందని, టెస్టులకు తాము సహకరిస్తామన్నారు.
అయేషా కేసులో దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తూనే ఉన్నామని, తమకు పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై నమ్మకం లేదని ఆరోపించారు. సీబీఐ కూడా న్యాయం చెయ్యకపోతే ఇక ఏ వ్యవస్థను ప్రజలు నమ్మరని ఆయేషా తల్లిదండ్రులు తెలిపారు.