ఒక నిర్లక్ష్యం..ఇద్దరు చిన్నారుల ప్రాణాలు హరించాయి. నిజామాబాద్ జిల్లా ముజాహిద్నగర్లో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు రియాజ్(10), మహ్మద్(5)గా గుర్తించారు. అయితే ఆ చిన్నారులు కారులోకి ఎలా వెళ్లారు..ఎవరైనా కావాలని ఆ కారులో బంధించి ఊపిరి ఆడకుండా చేశారా? లేదా ఆ చిన్నారులే ఆ కారులోకి వెళ్లి అనుకోకుండా లాక్ పడిపోయిందా అన్న విషయాలపై అనుమానాలు వస్తున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం నుంచి చిన్నారులు కనిపించకుండా పోయారు. దీంతో చిన్నారుల అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే, అర్థరాత్రి సమయంలో కారు వెనుక సీటులో విగత జీవులుగా పడివున్న ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ముజాహిద్నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.