జగన్ భారీ విజయాన్ని నమోదు చేసుకుని తన మార్క్ పాలనతో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకుంటున్నాడనేది ఒక యాంగిల్ అయితే, జగన్ పై రోజురోజుకి విమర్శలు పెరుగుతున్నాయనేది మరో యాంగిల్. సరే ఈ విమర్శలు ఎలాగూ ఉండేవే.. కానీ మనవాళ్లే చాటుగా విమర్శలు చేస్తే.. కాస్త ఆలోచించాల్సిన సమయమే. జగన్ కి భారీ మెజార్టీ రావడానికి కారణం జగన్ జనబలంతో పాటు కొంతమంది వైసీపీ నేతల త్యాగాలు కూడా. జగన్ మాటని గౌరవించి దాదాపు 25 మంది అభ్యర్థులు ఎన్నికలో పోటీచేయకుండా జగన్ టికెట్ ఇచ్చిన వాళ్లకి మద్దతు పలికి గెలిపించారు. అలా గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పెత్తనం చేస్తుంటే వాళ్ళ కోసం తమ సీట్లు వదులుకున్న నేతలు తమకి ఏమైనా నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతాడా అంటూ జగన్ వైపు ఆశగా చూస్తున్నారు. దాదాపు కృష్ణ, అనంతపూర్, ప్రకాశం, గోదావరి జిల్లాలో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టికెట్ రాని వాళ్ళు ఎక్కడ రెబల్ గా పోటీచేస్తారనే భయంతో పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఉంటుందని జగన్ వాళ్లకి చెప్పటంతో చాలా మంది సైలెంట్ గా ఉండిపోయారు, వైసీపీ గెలుపు కోసం పాటుపడ్డారు. అందుకే ఇప్పుడు పదవుల కోసం వాళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారిలో ఇంతవరకూ పదవులు మాత్రం దక్కించుకున్న వారు లేరు. పైగా జగన్ వాళ్ళకి ఇచ్చిన ఆ మాటను ఇప్పట్లో నిలబెట్టుకునే పరిస్థితిలో కూడా కనిపించడంలేదు. దీంతో ఆ నేతలంతా చాటు మాటుగా జగన్ ను విమర్శిస్తున్నారట.
ఈ రోజు నాలుగు గోడల మధ్య తిట్టినవాళ్ళు.. రేపు తమదైన రోజున నలుగురు ముందు తిట్టరని గ్యారింటీ ఏమిటి..? ఏమైనా ఈ మధ్య జగన్ పై విమర్శలు బాగానే పెరుగుతున్నాయి. ఈ మధ్య తరుచుగా టీడీపీ నాయకులూ జగన్ ప్రభుత్వం పై విశ్లేషాత్మకమైన ఆలోచింపజేసే ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత ఇసుక విధానాన్ని రద్దుచేసిన విధానం పై, జగన్ ది తుగ్లక్ నిర్ణయం అంటూ.. కేవలం జగన్ చేతగాని తనం వల్ల 20 లక్షల మంది అప్పుల పాలు అయ్యారని బాగానే విమర్శిస్తూ వస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఒకవిధంగా ఇలాంటి ఆరోపణలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. తన పై రోజురోజుకి ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి అని జగన్ ఇప్పటికైనా ఆలోచించుకుంటే మంచింది. నిజానికి, జగన్ తప్పులు చెయ్యట్లేదని.. చక్కని పాలననే అందిస్తున్నాడనే అభిప్రాయం మెజార్టీ జనంలో ఉంది. కానీ, మిగిలిన ఆ జనానికి ఉన్న అంసతృప్తిని కూడా జగన్ పారద్రోలితే జగన్ కే మంచింది.