ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కాలేదు, ఎక్కడా ఉప ఎన్నికలు కూడా లేవు,
ఏపీ అసెంబ్లీలో ఉన్నవి మూడే పార్టీలు. మరి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన
బీజేపీ ఎలా
అసెంబ్లీ గడప ఎలా తొక్కుతుంది...అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు కమలనాధులు. తోందరలో అనూహ్య పరిణామాలు
ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటాయని కూడా కచ్చితంగా చెబుతున్నారు.
ఏపీలో
టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. వారు అధినాయకత్వంలో టచ్ లో ఉన్నారట. ఈ మాట
కేంద్ర హోం శాఖ సహాయ మనంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. మరో వైపు సోము వీర్రాజూ అదే అంటున్నారు.
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇదే విషయం చెబుతూ గట్టిగా జబ్బ చరుస్తున్నారు.
మరి చంద్రబాబు పార్టీ నుంచి ఇంత మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెళ్ళిపోతే
టీడీపీ పరిస్థితి ఏంటి. అంటే దుకాణం బంద్ అంటోంది కమలం పార్టీ. బాబు లేని
టీడీపీ మాత్రమే తమకు కావాలని, ఆ పార్టీ నుంచి ఎందరు వచ్చినా చేర్చుకుంటాం, ఒక్క చంద్రబాబు,
లోకేష్ తప్ప అంటున్నారు కమలదళం నేతలు. కొద్ది రోజుల్లోనే ఏపీలో అనూహ్య పరిణామాలు సంభవిస్తాయని విశాఖలో
మీడియా మీట్లో మాట్లాడిన కిషన్ రెడ్డి అంటున్నారు. అదే విధంగా
ఏపీ అసెంబ్లీలో
బీజేపీ ప్రాతినిధ్యం వచ్చే సమావేశాల్లోగానే కనిపిస్తుందని కూడా సోము వీర్రాజు చెబుతున్నారు.
దీన్ని బట్టి చూస్తూంటే ఫిరాయింపుల వేటు పడకుంటా పెద్ద గ్యాంగే
టీడీపీ నుంచి రాబోతోందన్నమాట. అదే నిజం అనుకుంటే మాత్రం
టీడీపీ ఇక చెల్లాచెదురు కావడం తధ్యమేనంటున్నారు. చూడాలి మరి బాబు మార్క్ పాలిటిక్స్ తో దీన్ని ఎలా ఢీ కొంటారో.