చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా పుట్టిన కొవిడ్-19 వైరస్ భారత్లో తన రూపం మార్చుకుంటోందా..? ఇక్కడి వాతావరణం కారణంగా కరోనాలో ఏమైనా జన్యుపరమైన మర్పు వస్తోందా..? చైనాలోని కొవిడ్-19తో పోల్చితే భారత్లోని కరోనా కొమ్ములు బలహీనపడుతున్నాయా..? అంటే పలువురు పరిశోధకులు, వైద్యనిపుణులు మాత్రం అవుననే అంటున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్లో మాత్రం అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదు. కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా చాలా ఆశాజనంగా ఉండడం గమనార్హం. ఇదే సమయంలో వైరస్కు పుట్టినిల్లు అయిన చైనాతోపాటు, ఇటలీ, స్పెయిన్. అమెరికా తదితర దేశాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నారు. ఇక ప్రపంచం మొత్తంగా ఇప్పటివరకు సుమారు 33వేల మంది మృతి చెందారు. దీని బారిన పడినవారు సుమారు ఏడులక్షల మంది ఉన్నారు.
అయితే.. మిగతా దేశాలతో పోల్చితే మాత్రం భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా లేదని, క్రమంగా బలహీనపడుతోందని పలువురు నిపుణులు చెబుతున్నారు. భారత్లో కరోనా జన్యువులో మార్పులు వచ్చాయని, ఇక్కడ దీని కొమ్ములు చాలా వరకు బలహీనపడ్డాయని, ఈ సమయంలో మన ఆరోగ్యంపై పెద్దగా దాడి చేయలేదని అంటున్నారు. ఈ విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిందని కూడా చెబుతున్నారు. అయితే..కరోనా కొమ్ములు బలహీనపడడం మానవాళికి శుభవార్తేనని నిపుణులు అంటున్నారు. భారత్లో కరోనా బలహీనపడడానికి ప్రధానంగా ఇక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులే కారణమని అంటున్నారు. ఇక వైరస్ వ్యాప్తిని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కట్టడి చేశారని చెప్పొచ్చునని సూచిస్తున్నారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందని అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం అవుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే భారత్లో కరోనా పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అంటున్నారు. ఇప్పటివరకు అంటే ఈ నెల 29వ తేదీ వరకు వెయ్యిమందికిపైగా కరోనా బారిన పడ్డారు. 27మంది మరణించారు. మిగతా దేశాలతో పోల్చితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయనే చెప్పొచ్చు. ఆదివారం ఉదయం ప్రధాని మోడీ మన్కీబాత్లో మాట్లాడుతూ.. కరోనాపై మనం కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆదివారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 7 తర్వాత శుభవార్త వింటారని ప్రకటించారు.