యుధ్ధం అంటే పిరికివాడు చేసేది. ధైర్యవంతుడు ఎపుడు మౌనంగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అహింసా వాదాన్ని బలంగా వినిపించిన, దాన్ని కనుగొన్న మహాత్ముడు పుట్టిన గడ్డ భారతదేశం. ఈ దేశం శాంతిని నమ్ముకుంది. శాంతి అంటే అపరిమితమైన బలం. అది బలహీనత అనుకుంటే అవతల వారు చచ్చినట్లే.
ఇపుడు అదే జరగబోతోంది. మా జోలికి ఎవరైనా రానంతవరకే మాతో హాయిగా ఉంటుంది. తొంగి చూడాలనుకున్నా, గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనుకున్నా నరకమే చూస్తారు. ఇక నరకడం అంటూ భారత్ మొదలుపెడితే నరకం వద్ద నో వేకేన్సీ బోర్డులు పెట్టుకొవాల్సిందే. ఇది భారీ డైలాగ్ కాదు, సినిమా డైలాగ్ అంతకంటే కాదు. భారత్ తో ప్రత్యర్ధులకున్న దారుణమైన అనుభవం. ఇది భారత్ విశ్వరూపం. భారత్ ధర్మాగ్రహం.
ఇపుడు అదే అంతా చూస్తున్నారు. చైనా తోక జాడించింది. దొంగ దెబ్బ తీసింది. అమాయక భారత జవాన్ల పొట్టన పెట్టుకుంది, మౌన మునిలా ఉన్న భారత్ తో చెలగాటం ఆడింది. పులి జూలు పట్టుకుని ఉయ్యాల ఊగాలనుకుంది. దాని ఫలితం ఇపుడు చూస్తోంది.
చైనా చెవులకు రక్త పోటు వచ్చేలా సరిహద్దులో భారీ గర్జన వినిపిస్తోంది. పొలికేక పెడుతున్న భారత సేనల భీకరత్వాన్ని చైనా వినలేకున్నా వినాల్సివస్తోంది. పెడబొబ్బలు పెడుతున్న బెబ్బులి లాంటి భరత జవాన్ల నినాదాలను కూడా బిగ్గరగా వినాల్సివస్తోంది.
అవును సరిహద్దులో భారతీయ యుద్ధ విమానాలు దూసుకుపోతున్నాయి. ఆకాశంలో వికట్టహాసం చేస్తూ శత్రువు అంతు చూడాలనుకుంటున్నాయి. దొంగ దెబ్బ తీస్తూ చొంగ కార్చుకునే వారి పంబ రేపాలనుకుంటున్నాయి. ఒకటి రెండూ కాదు, వరసగా యుద్ధ విమానాలు అన్నీ ఆధునిక విమానాలే, అన్నీ టార్గెట్ ని చేరుకునేవే. అన్నీ చైనా గుండెల్లో గునపాలు దించేవే.
వీటికి సాటిగా, చైనాకు పోటీగా ఫ్రాన్స్ నుంచి మరిన్ని రఫెల్ రక్షణ విమానాలు ఈ నెలాఖరులోగా వస్తాయి. యుధ్ధానికి భారత్ సిద్ధమైపోయింది. ఇక కాచుకోవాల్సింది చైనావే. అవును.. ఇంతకీ దొంగ దెబ్బలు తీసే డ్రాగన్ కి భారత్ కి ఎదురు నిలిచి సమరానికి అంత ధైర్యం ఉందా. బోర విడిచి నిలువునా నిలిచి పోరాడే సత్తా ఉందా.