మామూలుగా పిల్లలు ఏదైనా కావాలనుకున్నప్పుడు అది తెచ్చిచ్చే వరకు మారాం చేస్తూనే ఉంటారు. అదే  తల్లిదండ్రులు మరింత గారాబంగా పెంచితే... ఇలా మారాం చేయడం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు పెట్టిన గారాబం ఏకంగా తమ కొడుకు ప్రాణాలు పోయేంత వరకు వచ్చింది. చిన్న విషయానికి సదరు బాలుడు తీసుకున్న నిర్ణయం ఏకంగా ప్రాణాలను తీసేసింది. తల్లిదండ్రులు బర్త్ డే డ్రెస్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా భయపెట్టాలని అనుకున్నాడు ఒక బాలుడు. కానీ ప్రమాదవశాత్తూ ప్రాణాలు వదిలాడు.



ఈ  ఘటన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గుండ్లపల్లి గ్రామానికి చెందిన మేకల నరసయ్య విజయ భార్యాభర్తలు. వీరికి పదహారేళ్ళ నివాస్, పదేళ్ళ కూతురు నిహారిక ఉన్నారు. నివాస్ ని చిన్నప్పుడు నుంచి ఎంతో గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. ప్రస్తుతం విద్యాసంస్థలు మూతపడడంతో నివాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ కొడుకు అడిగిందల్లా తెచ్చిపెడుతూ ఎంతో గారాబం చేశారు. ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నది  ఆ కుటుంబం. అంతలోనే నివాస్  బర్త్ డే  వచ్చింది.




పుట్టినరోజు నాడు నివాస్ కి కొత్త బట్టలు కొనేందుకు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు. నివాస్ మాత్రం తనకు డ్రెస్ కావాలంటూ పట్టుబట్టాడు. దీనికి తల్లిదండ్రులు నిరాకరించడంతో చచ్చిపోతానని బెదిరిస్తే తల్లిదండ్రులు భయపడి డ్రెస్ కొనిస్తారు అని అనుకున్నాడు సదరు బాలుడు. అయితే ఈ క్రమంలోనే ఒక గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. ఎంత పిలిచినా రాలేదు, స్నేహితులు పిలిచిన రాలేదు. కాసేపటికీ వాడే వస్తాడులే అనుకుని తల్లిదండ్రులు కూడా ఊరుకున్నారు. ఈ క్రమంలోనే తాడుతో ఉరి వేసుకుంటున్నట్లు  బెదిరించే క్రమంలో ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకొని ప్రాణాలు వదిలాడు ఆ బాలుడు. ఇక ఊహించని విధంగా ఎంతో గారాబంగా పెంచుకున్న తమ కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: