బిజెపి, వైసీపీ ల మధ్య పొత్తు కుదిరిందో లేదో ఇంకా స్పష్టమైన క్లారిటీ రానప్పటికీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అనుమానం వైసీపీ నేతలను ఇప్పుడు వెంటాడుతోంది. జగన్ మోదీల మధ్య చర్చల సారాంశం ఏమిటనేది స్పష్టంగా ఎవరికీ తెలియనప్పటికీ, వారిద్దరి భేటీకి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పొత్తు వ్యవహారంపై అటు బిజెపి, ఇటు వైసీపీ అధికారికంగా స్పందించలేదు. జగన్ సైతం ఢిల్లీ పరిణామాల గురించి ఎవరి దగ్గర నోరు మెదపడం లేదు. అయితే ఎన్డీఏలో చేరకుండానే బయట నుండి బీజేపీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి అన్ని రకాలుగా సహకరిస్తూ, కీలకమైన బిల్లులు ప్రవేశపట్టినప్పుడు మద్దతు పలుకుతూ వస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ఎన్డీయే లో చేరాల్సిందిగా బిజెపి అగ్రనాయకులు జగన్ ను  కోరారట. అసలు ఎన్డీయేలోకి వైసీపీ చేరుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలోనే, ఢిల్లీలో రెండు రోజులపాటు జగన్ అన్ని వ్యవహారాలను చక్కబెట్టే పనిలో ఉండడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. జగన్ మోదీ భేటీ లో ఏ అంశాల గురించి మాట్లాడుకున్నారో తెలీయక అటు బీజేపీ, ఇటు వైసీపీ నేతలు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతల్లో ఈ టెన్షన్ బాగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది.


ఎందుకంటే ఎన్డీఏ లోకి వైసీపీ చేరితే, రాజకీయంగా తమకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని, మొన్నటి వరకు వైసిపిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి హడావుడి చేస్తూ, పెద్ద ఎత్తున విమర్శలు చేశామని, ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, ఏపీలో వైసీపీ తో కలిసి ముందుకు వెళ్లాల్సి వస్తుందని, ఇప్పుడు ఆ పార్టీ తో కలిసి వెళ్తే ప్రజల్లో బీజేపీపై నమ్మకం పోతుందని, అలాగే ఈ వ్యవహారంలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నాయకులు విశ్లేషణ చేసుకుంటున్నారు.


 ప్రస్తుతానికి వైసీపీతో పొత్తు బాగానే ఉన్నా, ఎన్నికల సమయం నాటికి అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని, జగన్ మరింత బలపడితే బీజేపీకి సీట్లు కేటాయించే విషయంలో ఆయన అనుకూలంగా స్పందించే అవకాశం ఉండదని, ఏపీలో సొంతంగా బలం పెంచుకునేందుకు తమకు వైసీపీతో పొత్తు వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతాయనే ఆందోళనలో ఏపీ బీజేపీ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అయితే పొత్తు విషయంలో మాత్రం అటు బిజెపి అధిష్ఠానం కానీ, ఇటు వైసిపి కానీ క్లారిటీ ఇవ్వకపోవడం, ముందు ముందు వైసీపీ విషయంలో ఏవిధంగా స్పందించాలో తెలియక పోవడం వంటి పరిణామాలు ఏపీ బిజెపి నేతలకు కాస్త దడ పుట్టిస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: