ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆర్థికంగా చితికిపోయి తక్కువ ఆదాయం కలిగిన ఎన్నో పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఊరట కలిగించే విధంగా ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా నిర్ణయించింది. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో సరైన ఉపకరణాలు లేక ఎంతోమంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికి సహాయం చేసేందుకు అమెజాన్ ఇండియా ముందుకు వచ్చింది. డెలివరీ స్మైల్స్ పేరుతో ఈ కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఇటీవల ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ విరాళాలను కూడా అందించి గొప్ప మనసు చాటుకునేందుకు అవకాశం ఉంది అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కు సంబంధించిన ఉపకరణాలను బహుమతులు అందిస్తారు. ఐదు వేల రూపాయల విలువ చేసే 4 జి టాబ్స్ ను 18 మంది ఎన్జీవోల ద్వారా విద్యార్థులకు అందించనున్నారు. అంతేకాదు విద్యార్థులందరికీ 10 వేల కన్నా తక్కువ ధరలోనే మొబైల్ ఫోన్లు టాబ్లెట్ కంప్యూటర్లు కూడా అమెజాన్ గిఫ్ట్ స్మైల్ పేజీలో ఎన్జీవో జాబితాలో అందుబాటులో ఉంచారు. ఇది పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అమెజాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.