గ్రేటర్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. దీంతో ఎక్కడికక్కడ నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. ఇప్పటి వరకు నాయకుల ప్రసంగాలతో నగరమంతా మైకుల హోరు వినిపించినా, ఇప్పుడు వాతావరణం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. డిసెంబర్ ఒకటో తేదీన ఎన్నికలు జరగబోతుండడం తో, ఆ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభ పెట్టె కార్యక్రమం మొదలవడంతో, ఎన్నికల కమిషన్ వాటిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయం ముగిసిన పిదప ఇకపై ఎవరు ప్రచారం నిర్వహించినా, రెండేళ్ళ జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రచారం గడువు ముగియడంతో బయట వ్యక్తులు జిహెచ్ఎంసి పరిధి దాటి బయటకు వెళ్లాలని పార్థసారధి ఆదేశించారు.
జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఉండగా వారిలో, 38,89,637 మంది పురుషులు, 35,76,941 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. 678 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం గా 9101 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని పార్థసారధి పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్ల లో 1122 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టిఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149 మంది,
టిడిపి నుంచి 106, ఎంఐఎం నుంచి 51, సిపిఐ 17 , సిపిఎం 12 మంది అభ్యర్థులతో పాటు, 415 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని, సాయంత్రం 6 గంటల కు పోలింగ్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
కరోనా పాజిటివ్ ప్రభావానికి గురైన ఓటర్లు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటు వేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేసేందుకు 19 మంది ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని, ప్రజలు
పార్టీ నేతలు ఎటువంటి ఫిర్యాదు అయినా నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదులు కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 040- 295555500 ను సంప్రదించాలని పార్థసారధి పేర్కొన్నారు. అలాగే ఓటర్ గుర్తింపు కార్డు కు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపు కార్డులలో ఒక దాన్ని చూపించి ఓటు వేసేందుకు అనుమతిస్తామని
లోకేష్ కుమార్ పేర్కొన్నారు.
ఆధార్ కార్డ్ , పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో తో ఉన్న సర్వీస్ ఐడెంటి కార్డు, ఫోటో తో ఉన్న
బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డ్ ఎం సి ఆర్ స్మార్ట్ కార్డ్
జాబ్ కార్డు, హెల్త్ కార్డ్, రేషన్ కార్డ్ , కుల దృవీకరణ పత్రం, స్వాతంత్ర సమరయోధుల గుర్తింపుకార్డు, అంగవైకల్యం ధ్రువపత్రం, పట్టాదారు పాసుపుస్తకం ఇలా దేనినైనా చూపించి ఓటు వేసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.